వేలానికి కింగ్ఫిషర్ హౌస్: ప్రారంభ ధర 150 కోట్లు
ముంబై: బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుని తిరిగి చెల్లించని కేసులో నిందితుడిగా ఉన్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకులు సన్నద్ధమయ్యాయి. ఇందులో భాగంగా విజయ్ మాల్యా నివాసాన్ని గురువారం ఎస్బీఐ అధికారులు వేలం వేయనున్నారు.
సిటీ ఎయిర్ పోర్టుకు అతి సమీపంలో 2,401.70 చదరపు మీటర్లలో ఉన్న కింగ్ఫిషర్ హౌస్ ప్రారంభ ధరను రూ.150 కోట్లుగా నిర్ణయించారు. ఈ మేరకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ గురువారం ఈ బంగ్లాను ఆన్లైన్లో వేలం వేయనుంది.
ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు రూ. 5 లక్షలు చెల్లించి, రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మాల్యాకు చెందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ దేశంలోని 17 బ్యాంకుల నుంచి రూ. 6,963 కోట్లు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు.
ఆ తర్వాత కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూత పడటంతో గతేడాది కింగ్ఫిషర్ హౌస్ను ఎస్బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే క్రమంలో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన కింగ్ఫిషర్ హౌస్తో పాటు గోవాలోని కింగ్ఫిషర్కు చెందిన విల్లాను మాల్యా పూచీకత్తుగా చూపించారు.
దీంతో ముంబైలోని కింగ్ఫిషర్ హౌస్తో పాటు గోవాలోని కింగ్ఫిషర్కు చెందిన విల్లాను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విల్లాకు రూ. 90 కోట్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. భారత్లోని 17 బ్యాంకులకు మాల్యా సుమారు రూ.9,500 కోట్ల రుణాలు చెల్లించాల్సి ఉంది.
Mumbai: SBI to e-auction Kingfisher House today pic.twitter.com/CavwN9BfSg
— ANI (@ANI_news) 17 March 2016