బహిర్గతం: విప్రో సీఈఓ వేతనం ఎంతో తెలిసింది?
బెంగుళూరు: భారత ఐటీ దిగ్గజం విప్రో సంస్ధ సీఈఓ అబిద్ అలీ నీముచ్వాలా 1.3 మిలియన్ నుంచి 2.19 మిలియన్ డాలర్లు ( అంటే సుమారు రూ. 8.9 కోట్ల నుంచి రూ. 15 కోట్ల) వరకు వేతనాన్ని అందుకోనున్నారు. అంతేకాదు దీనికితోడు అదనంగా స్టాక్స్ ఆధారిత పరిహారాలు, ఇతర ప్రయోజనాలు లభించనున్నాయి.
7.5 బిలియన్ డాలర్ల విలువ గల విప్రో కంపెనీ సీఈఓగా నిముచ్వాలా ఫిబ్రవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు బేస్ పే 8,00,004 డాలర్లు నుంచి 12 లక్షల డాలర్లు మధ్య అందనుండగా, 'టార్గెట్ వెరియబుల్ పే' రూపంలో 5 నుంచి 10 లక్షల డాలర్ల మధ్య (5,00,004 -9,99,996 మధ్య) అందనుంది.
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి విప్రో సంస్థ సమర్పించిన ఫిల్లింగ్స్ మేరకు ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని డల్లాస్కు చెందిన నిముచ్వాలాకు విప్రో కంపెనీ బోర్డు నిర్ణయం మేరకు యంప్లాయి స్టాక్ ఆప్షన్లతో పాటు స్టాక్ మార్కెట్ వాటాలా రూపంలో ఇతర ప్రయోజనాలు లభించనున్నాయి.
స్టాక్ మార్కెట్ వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, నామినేషన్ అండ్ కాంపన్సెషన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ ప్రయోజనాలు ఆయనకు అందుతాయని తెలిపింది. విప్రో మాజీ వైస్ ఛైర్మన్ టీకే కురియన్ సుమారు రూ. 8.46 కోట్ల వేతనాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.