ఆసియా మార్కెట్పై 'డ్రాగన్' దెబ్బ: భారీ నష్టాలు
ముంబై: ఆసియా స్టాక్ మార్కెట్లపై 'డ్రాగన్' దెబ్బ మరోసారి పడింది. చైనా స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న పరిణామాలతో జపాన్, భారత్ సహా పలు దేశాల స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా చైనా స్టాక్ మార్కెట్లో ‘సీఎస్ఐ-300' సూచీ 7 శాతం కన్నా ఎక్కువగా క్షీణత నమోదు కావటంతో అక్కడ గురువారం ట్రేడింగ్ నిలిపేశారు.
ఈ వారంలోనే చైనాలో సెల్ ఆఫ్ కారణంగా మార్కెట్లను నిలిపివేయడం ఇది రెండో సారి. మార్కెట్లు ప్రారంభమైన 30 నిమిషాలకే భారీగా పతనం దిశగా కొనసాగడంతో చైనా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపివేశారు. గడచిన 25 ఏళ్లలో అతి తక్కువ సమయంలో చైనా మార్కెట్లు ఈరోజే ట్రేడయ్యాయి.
గురువారం భారత్లో ట్రేడింగ్ ఆరంభంలోనే మార్కెట్లో బీఎస్ఈ సెన్సెక్స్ 321.31 పాయింట్లు కోల్పోయి 25,085.02 వద్ద ట్రేడ్ అవగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 99.55 పాయింట్లు కోల్పోయి 7641.45 వద్ద ట్రేడ్ అయింది. ఇక మధ్యాహ్నం 2.20 గంటల ప్రాంతానికి బీఎస్ఈ సెన్సెక్స్ 474 పాయింట్లు నష్టపోయి 24,932 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 150 పాయింట్లు నష్టపోయి 7590 వద్ద ట్రేడవుతోంది.
ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు 52 వారాల కనిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్, హిందాల్కో ఇండస్ట్రీస్, అడానీ పోర్ట్స్, టాటా స్టీల్స్ ఉదయం 11 గంటల నుంచే 3-4 శాతానికి క్షీణించాయి.
'డ్రాగన్' ప్రభావం ఒక్క భారత్ మార్కెట్ పైనే కాదు ఆసియాలోని అన్ని మార్కెట్లపై పడింది. జపాన్ మార్కెట్( నిక్కీ) 423 పాయింట్లు, హాంకాంగ్ మార్కెట్ (హాంగ్ సెంగ్) 627, సింగపూర్ మార్కెట్ (స్ట్రేయిట్ టైమ్స్)60 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతున్నాయి.