జన్ ధన్ యోజన: అకౌంట్లు 7 కోట్లు, డబ్బు రూ. 5వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలనే సదుద్దేశంతో జీరో బ్యాలెన్స్ అకౌంట్ పేరుతో ప్రారంభించిన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో ఇప్పటికే రూ. 5వేల కోట్లు జమ అయ్యాయి.
తాజా గణాంకాల ప్రకారం నవంబర్ 3 నాటికి రూ. 5,300కోట్లు జమ అయ్యాయి. జన్ ధన్ ఖాతాలు తెరవకపోతే ఈ డబ్బంతా లెక్కలోకి రాకుండా ఇళ్లలోనే ఉపయోగం లేకుండా ఉండేదని ఆర్ధిక నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది ఇలా ఉంటే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద ఇప్పటిదాకా 7 కోట్ల బ్యాంకు ఖాతాలు కొత్తగా నమోదయ్యాయి. జన్ ధన్ యోజన పథకంలో జీరో బ్యాలెన్స్ కింద ఖాతాలు జారీ చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకుల బాట పట్టారు.
ఈ నెల 3 నాటికి దేశవ్యాప్తంగా 6.98 కోట్ల బ్యాంకు ఖాతాలు ఓపెన్ కాగా, వాటిలో 4 కోట్ల ఖాతాలకు రూపే (ఏటీఎం) కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. మిగిలిన 3 కోట్ల మేర కార్డులు త్వరలో ఖాతాదారులకు చేరనున్నాయి. ఆగస్టు 29న ప్రారంభమైన ఈ పథకం కింద 2015 జనవరి 26 నాటికి 7.5 కోట్ల ఖాతాలు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది.
అయితే, గడువు కంటే ముందుగానే ఖాతాల సంఖ్య లక్ష్యం దాటిపోతున్న నేపథ్యంలో 2015 ఆగస్టు 15 నాటికి 15 కోట్ల ఖాతాలు తెరిపించాలని ఆర్థిక శాఖ తాజాగా తన లక్ష్యాన్ని సవరించుకుంది.