4జి,వైఫై: కెసిఆర్తో రిలయన్స్ ప్రతినిధులు(ఫొటో)
హైదరాబాద్: నగరంలో సెప్టెంబర్ నెల చివరి నాటికి 4జి, వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నగరంలో 4జి సేవల విస్తరణకు రిలయన్స్ ఇప్పటికే ముందుకు వచ్చిన నేపథ్యంలో 4జి, వైఫై నగరంగా హైదరాబాద్ అనే అంశంపై గురువారం సచివాలయంలో కెసిఆర్.. అధికారులు, రిలయన్స్ ప్రతినిధులతో సమీక్ష జరిపారు.
నగరంలో డిజిటల్ బ్రాడ్ బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపర్చాలని కెసిఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రిలయన్స్ సంస్థ రాష్ట్ర సిఈఓ కెఎస్ వేణుగోపాల్,కో ఆర్డినేటర్ పివిఎల్ మాధవరావు మాట్లాడుతూ.. మొత్తం హైదరాబాద్ నగరాన్ని 4జి, వైఫై నగరంగా మార్చాలనే ప్రభుత్వ పట్టుదలకు తమ సంస్థ సహకారం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రిలయన్స్ ప్రతినిధులు చెప్పారు.
రాష్ట్రంలో వైఫై సేవల విస్తరణ కోసం రూ. 4,100 కోట్లను దశలవారీగా ఖర్చు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరంలోనే 1700 కిలోమీటర్ల మేర ఓఎఫ్సి(ఆప్టిక్ ఫైబర్ కేబుల్) లైన్లు వేస్తున్నామని, ఇప్పటికే 500 కిలోమీటర్ల లైన్ల నిర్మాణం పూర్తియినట్లు చెప్పారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని 4జి, వైఫై నగరంగా మారుస్తామని వారు తెలిపారు.