ఢిల్లీ/ముంబై: భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం గుజరాత్లోని కంపెనీల స్టాక్స్పైన కూడా భారీగానే కనిపిస్తోంది. ఏడు నెలల క్రితం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బిజెపి తన ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటినుంచి గుజరాత్నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల షేర్ల ధరలు దాదాపు మూడు రెట్లదాకా లాభపడ్డాయి.
గత సెప్టెంబర్ 13న మోడీ అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడినప్పటినుంచి వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అదానీ గ్రూప్నకు చెందిన కంపెనీలతో పాటుగా గుజరాత్కు చెందిన పలు కంపెనీలు భారీగా లాభపడినట్లు గత ఏడు నెలలుగా వాటి స్టాక్స్ కదలికల విశ్లేషణను బట్టి అర్థమవుతోంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారన్న అంచనాలే ఈ కంపెనీల స్టాక్స్ భారీగా పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అయితే ఒక వేళ గనుక ఆ ఆ అంచనాలు నెరవేరని పక్షంలో అవి ఏ కనిష్ట స్థాయిలకు చేరతాయో చెప్పలేమని కూడా హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడు నెలల కాలంలో అదానీ గ్రూప్కు చెందిన ప్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ షేరు ధర మూడు రెట్లకు పైగా పెరిగింది. సెప్టెంబర్ 13న 141.20 రూపాయలున్న ఆ కంపెనీ షేరు ధర ఏప్రిల్ 11న 437.50 రూపాయలకు చేరుకుంది. అదానీ గ్రూపునకు చెందిన మిగతా కంపెనీల్లో అదానీ పవర్ షేరు ధర 52.62 శాతం పెరగ్గా, అదానీ పోర్ట్స్ షేరు 42.54 శాతం పెరిగినట్లు బిఎస్ఇ గణాంకాలను బట్టి తెలుస్తోంది.
కాగా, ఇన్వెస్టర్ల దృష్టిని ఆకట్టుకున్న మిగతా గుజరాత్ కంపెనీల్లో అరవింద్ లిమిటెడ్ షేరు రెట్టింపునకు పైగా పెరిగింది, గుజరాత్ పిపావావ్ పోర్ట్ షేరు 91.13 శాతం పెరగ్గా, గుజరాత్ ఖనిజాభివృద్ధి సంస్థ(జిఎండిసి) షేరు 53.46 శాతం, కాడిలా షేరు 45.49 శాతం పెరిగాయి.
గత ఏడు నెలల కాలంలో టోరెంట్ పవర్ షేరు 37.57 శాతం పెరగ్గా, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ 37.57 శాతం, గుజరాత్ ఆల్కలీస్ 30.82 శాతం పెరిగాయి. మోడీ ప్రధానమంత్రి అయితే గుజరాత్కు చెందిన కంపెనీలకు మేలు జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ స్టాక్స్ భారీగా పెరగడానికి మోడీ అంశం ప్రధాన కారణమని ఆగుమెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సిఈఓ గజేంద్ర నాగ్పాల్ చెబుతున్నారు. కాగా, మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితే స్టాక్మార్కెట్లో 10 శాతానికి పైగా ర్యాలీ వచ్చే అవకాశం ఉందని జపాన్కు చెందిన బ్రోకరేజ్ సంస్థ ‘నోమురా' వెల్లడించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications