సహారా ప్రతిపాదనల తిరస్కరణ: జైల్లోనే సుబ్రతా
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు వాయిదాల వారీగా డబ్బు చెల్లిస్తామన్న సహారా గ్రూప్ అధిపతి సుబ్రతా రాయ్ ప్రతిపాదనలను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. సుబ్రతా రాయ్ సహా మరో ఇద్దరు బోర్డ్ డైరెక్టర్ల విడుదలకూ కోర్టు అంగీకరించలేదు. మార్చి 11న మళ్లీ కోర్టులో విచారణ వరకూ సుబ్రతా రాయ్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది.
ప్రస్తుతం సుబ్రతా రాయ్ తీహార్ జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న రోజులలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు సుబ్రతా రాయ్ను కలిసేందుకు కన్సల్టెంట్లు, అతని తరపు న్యాయవాదులకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్లలో మార్చి నెల కొంతమేర, మిగిలిన మొత్తం తర్వాత వాయిదాల వారీగా చెల్లిస్తామని సహారా గ్రూప్ ప్రతిపాదించింది.
మూడు పని దినాల్లోగా రూ. 2500 కోట్లు మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో డిపాజిట్ చేస్తామని సహారా కోర్టుకు తెలిపింది. కాగా సహారా ప్రతిపాదనలను కోర్టు తిరస్కరించింది.
ఈసారైనా సరైన ప్రతిపాదనలతో తమ ముందుకు రావాలని అత్యున్నత న్యాయస్థానం సహారా సంస్థకు సూచించింది. సుబ్రతా రాయ్ పోలీస్ కస్టడీపై సుప్రీం కోర్టు మంగళవారం(మార్చి 11న) విచారణ చేపట్టనుంది.