జాబ్స్: చరిత్ర సృష్టించిన ఐఐటి ఖరగ్పూర్
కోల్కతా: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్ (ఐఐటి ఖరగ్పూర్) క్యాంపస్ ప్లేస్మెంట్లలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఐఐటి ఖరగ్పూర్లో తొలి దశలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది చరిత్ర సృష్టించారు. డిసెంబర్ వరకు పూర్తయిన తొలి రౌండ్ ప్లేస్మెంట్లలో సుమారు 1,010 మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించారు.
తొలి దశలోనే అత్యధిక మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొంది నూతన రికార్డును సాధించారని ఐఐటి ఖరగ్పూర్ అధికారులు పేర్కొన్నారు. తమ క్యాంపస్లో దిగ్గజ ఐటి కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించాయని తెలిపారు. ఇందులో గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓరాకిల్, షెల్, డ్యుయిష్ బ్యాంక్, ఐటిసి, చ్లంబర్గ్, గోల్డ్మ్యాన్ స్యాక్స్, క్రిడిట్ సూసి, అబ్బొట్, ఈఎక్స్ఎల్, హౌసింగ్. కామ్ వంటి పలు కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు.
అమెరికాకు చెందిన పలు బహుళ జాతి సంస్థలు భారీ మొత్తంలో చెల్లించి ఐఐటి విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయని చెప్పారు. వార్షిక జీతం 1.25 లక్షల డాలర్లు (సుమారు రూ. 77 లక్షలు) ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. దేశీయ కంపెనీలు అయితే అత్యధికంగా వార్షిక జీతం రూ. 37 లక్షలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు.
కొత్తగా ప్రవేశపెట్టిన రెండు ద్వంద్వ డిగ్రీలు ఫైనాన్షియల్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సుల నుంచే సుమారు 85 శాతం మంది విద్యార్థులు అవకాశాలు పొందారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలు, కార్యక్రమాలు ప్రవేశపెట్టడం వల్లే తమ విద్యార్థులను పారిశ్రామిక సంస్థలు ఎంపిక చేసుకున్నాయని ఐఐటి ఖరగ్పూర్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ ఇంఛార్జ్, ప్రొఫెసర్ సుధీర్ కుమార్ బరాయి తెలిపారు. 2013లో 195 సంస్థలు అదనంగా పాల్గొన్నాయని తెలిపారు. మరో 79 మంది విద్యార్థులు కూడా ఇతర కంపెనీల నుంచి అవకాశాలు పొందారని పేర్కొన్నారు.
కాగా మహారాష్ట్రలోని ముంబై ఐఐటిలో జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో 900 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను పొందారు. ఇదే సమయంలో ఢిల్లీ ఐఐటి క్యాంపస్లో 750 మంది విద్యార్థులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ ఐఐటి క్యాంపస్లో 700 మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు.