ఆంధ్రాబ్యాంక్ సిఎండిగా రాజేంద్రన్
శనివారం ఉదయం రాజేంద్రన్ హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయానికి వస్తారని సమాచారం. ఆగస్టు 31న బిఎ ప్రభాకర్ పదవీ విరమణ చేశాక, ఇప్పటి వరకు ఆంధ్రాబ్యాంకు సిఎండి పదవి ఖాళీగా ఉంది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజేంద్రన్, 1955 ఏప్రిల్ 8న జన్మించారు. ఎంకాం, సిఏఐఐబి, ఐసిడబ్ల్యూఏ (ఇంటర్) విద్యార్హతలున్న రాజేంద్రన్ 1978లో కార్పొరేషన్ బ్యాంకు అధికారిగా వృత్తి జీవితం ఆరంభించారు.
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, మర్చంట్ బ్యాంకింగ్ రంగాల్లో అనుభవంతో పాటు సమాచార సాంకేతిక రంగంలోనూ ప్రావీణ్యం ఉంది. రెండు నెలల క్రితమే రాజేంద్రన్ నియామకం ఖరారైనప్పటికీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సివిసి) నుంచి క్లియరెన్స్ రావడంలో ఆలస్యం జరిగింది.
ప్రభుత్వ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాలి: ప్రణబ్
ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి అవసరమని, ఆ సంస్థలను ప్రైవేట్రంగ సంస్థలతో సమానంగా ప్రోత్సహించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యుత్తమ ప్రదర్శన దిశగా ప్రభుత్వరంగ సంస్థలను తీసుకెళ్లేందుకు త్వరగా నిర్ణయాలు తీసుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.
మన దేశంలో సుమారు 260 ప్రభుత్వరంగ సంస్థలుంటే, అందులో కేవలం 60 సంస్థలే స్టాక్మార్కెట్లలో లిస్ట్ అయ్యాయని ఆయన గుర్తుచేశారు. మరిన్ని సంస్థలు స్టాక్మార్కెట్లలో ప్రవేశిస్తే లక్షలాది మంది మదుపర్లకు వాటిల్లో భాగస్వామ్యానికి అవకాశం లభిస్తుందని ప్రణబ్ అన్నారు. నిజానికి మార్కెట్లో ఉన్న పోటీ వాతావరణాన్ని నిలదొక్కుకుని అవకాశాలను పెంచుకోవడంలో ప్రభుత్వరంగ సంస్థలు వెనుకబడ్డాయని, సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అవసరమని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.