మార్కెట్కు యుఎస్ కిక్: రాజన్ వైపు చూపు
ఫెడ్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకునే వెసులుబాటు లభించిన రాజన్ ఎలాంటి వ్యూహంతో మార్కెట్లను అలరిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. బ్రోకర్లు, ఆపరేటర్లు, ఎఫ్ఐఐలు చెలరేగి సాగించిన కొనుగోళ్లతో బిఎస్ఇ సెన్సెక్స్ 684 పాయింట్లు దూసుకుపోయింది. దాదాపు మూడేళ్ల గరిష్ఠ స్థాయి 20,646.64 పాయింట్ల వద్ద ముగిసింది.
డాలర్ మారకంలో రూపాయి మళ్లీ 61 స్థాయిని చేరింది. మరికొంతకాలం పాటు ఉద్దీపన ప్యాకేజీలను కొనసాగించాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లలో ఊ పునకు, కైపుకు కారణం. ప్రపంచవ్యాప్తంగా అంతా ఉత్కంఠగా ఎదురు చూసిన ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో ప్రతినెలా ఎప్పటిలాగానే 8,500 కోట్ల డాలర్ల బాండ్ల కొనుగోలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం ఆశిస్తున్నదే అయినప్పటికీ అనూహ్యం కావడం భారత్తో పాటు వర్ధమాన దేశాల మార్కెట్లను ఆనందంలో ముంచెత్తింది. ద్రవ్యలభ్యతను పెంచే ఉద్దీపనల ఉపసంహరణలో భాగంగా ప్రతినెలా 8,500 కోట్ల డాలర్ల బాండ్లను అమెరికా కొనుగోలు చేస్తోంది. ఈ మొత్తాన్ని ఎంతో కొంత తగ్గిస్తారని ఎనలిస్టులు అంచనావేశారు.
సెన్సెక్స్ ప్రారంభమే అదిరింది. అంత క్రితం ముగింపుతో పోలిస్తే 390 పాయింట్ల లాభంతో మొదలైంది. ఆ తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదు. ట్రేడింగ్ ముగియడానికి కాస్త ముందు 20,739.69 వద్ద గరిష్ఠస్థాయికి చేరింది. దాదపు నాలుగేళ్ల తర్వాత సెన్సెక్స్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.
ఫెడ్ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న మార్కెట్లు ఇప్పుడు ఆర్బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తన తొలి పరపతి విధాన సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో ఆయన వైపు చూస్తున్నాయి. యుస్ ఫెడరల్ రిజర్వ్ ఉద్ధీపన పథకాలు కొనసాగిస్తున్నట్లు ప్రకటించడం రాజన్కు ఊరటనిచ్చే అంశం.