ఆంధ్రా బ్యాంక్ లాభం రూ. 257 కోట్లు, నికర లాభంలో 15 శాతం క్షీణత
బిజినెస్ పరంగా 2012-13 మూడవ త్రైమాసికంలో 14 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించారు. బ్యాంక్ గరిష్ఠ మొండి బకాయిలు డిసెంబర్ త్రైమాసికం నాటికి రూ. 2,023.32 కోట్లు కాగా గత ఏడాది ఇదేకాలంలో మొండి బకాయిలు రూ. 943.27 కోట్లు. ఇక బ్యాంక్ గరిష్ఠ ఆదాయం క్యూ3లో రూ. 3,469.21 కోట్లకు చేరగా అంతకు ముందు ఏడాది ఇదేకాలంలో రూ. 3,158.26 కోట్లని బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. గత తొమ్మిది నెలల కాలానికి బ్యాంకు నికర లాభం 6 శాతం క్షీణించి రూ. 944.55 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికరలాభం రూ. 1,005కోట్లని అన్నారు.
రాష్ట్రంలోకి భారీ ప్రాజెక్టులు ఏవి రావడం లేదని పేర్కొన్నారు. దీంతో మధ్య, భారీ కార్పొరేట్ రుణాల్లో వృద్ధి తగ్గిందని తెలిపారు. ప్రాధాన్యత రంగాల రుణాల మంజూరులో మాత్రం 23.7 శాతం వృద్ధి సాధించామని చెప్పారు. వ్యవసాయ రంగానికి అందించిన రుణాల్లో ఏకంగా 26.8 శాతం పెరుగుదల ఉందన్నారు. నిర్వహణ లాభం కూడా తగ్గింది. గత ఏడాది రూ.767 కోట్లు నిర్వహణ లాభం సాధిస్తే ఈ ఏడాది రూ. 712 కోట్లు సాధించినట్లు ఆయన వెల్లడించారు. డిపాజిట్ల సేకరణలో కూడా ముందంజలో మాత్రం ముందున్నట్లు తెలిపారు. గత ఏడాది రూ.98,680 కోట్లు డిపాజిట్లు సేకరిస్తే ఈ ఏడాది 14 శాతం పెరిగి రూ. 1,12,448 కోట్లు సేకరించినట్లు తెలిపారు. పెరిగిన ఖర్చుల కారణంగానే నికర లాభం, నిర్వహణ లాభం తగ్గిందని అన్నారు.
రాబోయే కాలంలో బ్యాంక్ విస్తరణ కార్యక్రమాలకు మూలధనం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లుఆంధ్రాబ్యాంక్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ బి.ఏ. ప్రభాకరరావు తెలిపారు. ఎంత మొత్తం అవసరమన్న దానిపై ఇంకా ఒక అంచనాకు రాలేదని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆంధ్రాబ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో 12.3% నుంచి 11.86 శాతానికి తగ్గింది. వచ్చే పరపతి సమీక్షలో ఆర్బీఐ వడ్డీరేట్లను పావు శాతం తగ్గిస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు వన్ఇండియా