వాద్రాపై కేజ్రీవాల్ అటాక్: షేర్మార్కెట్లో డిఎల్ఎఫ్కు దెబ్బ
అయితే కేజ్రీవాల్.. డిఎల్ఎఫ్తో వాద్రా ఒప్పందాలు బయటపెట్టడం, వాద్రా అక్రమంగా సంపాదిస్తున్నారని చెప్పడం డిఎల్ఎఫ్ పైన ప్రభావం పడింది. ఈ రోజు షేర్ మార్కెట్లో డిఎల్ఎఫ్కు షాక్ తగిలింది. షేర్ మార్కెట్లో డిఎల్ఎఫ్ షేర్లు ఐదు శాతం మేర తగ్గాయి. కాగా అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల క్రితం రాబర్ట్ వాద్రా పైన తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాద్రా ఆదివారం వివరణ కూడా ఇచ్చారు.
తమ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్లు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాద్రా ఆదివారం అన్నారు. రెండు రోజుల క్రితం అరవింద్ కేజ్రీవాల్ రాబర్ట్ వాద్రాపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దానిపై వాద్రా ఈ రోజు స్పందించారు. రాబర్ట్ వాద్రా స్పందించి, తన అత్త సోనియా గాంధీకి కాస్త ఉపశమనం కలిగించారనే చెప్పవచ్చు. కేజ్రీవాల్ ఆరోపణలపై రెండు రోజులుగా వాద్రా ఏమీ మాట్లాడక పోవడం కాంగ్రెసుకు ముఖ్యంగా సోనియాకు తలనొప్పి తెచ్చి పెట్టింది.
ఇప్పుడు వాద్రా ఎదురుదాడి చేయడం గమనార్హం. తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టబద్దంగానే బిజినెస్ చేస్తున్నానని వివరణ ఇచ్చారు. కేజ్రీవాల్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారని, అందుకు మీడియాలో ప్రచారం కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మీ వద్ద తన వ్యాపారానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు. అంతేకాని తన కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయడం సరికాదన్నారు. కొత్తగా పార్టీ పెట్టినంత మాత్రాన విమర్శలు చేయాలా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్లు తనపై చేస్తున్న ఆరోపలలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇరవై ఒక్క ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా డిఎల్ఎఫ్ కూడా కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించింది. రాబర్ట్తో తమకు ఎలాంటి అక్రమ ఒప్పందాలు లేవని ప్రకటించింది.