కరోనా దెబ్బ: లాక్డౌన్ ఎత్తేశాక కూడా 20% రిటైల్ షాప్స్ క్లోజ్, కారణాలివే
కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. చాలా దుకాణాలు మూతబడ్డాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా దాదాపు 20 శాతం రిటైల్ షాప్స్ ఓపెన్ చేసే పరిస్థితులు లేవట. రెండు నెలలుగా వ్యాపారాలు లేక దుకాణాదారులు అద్దెలు చెల్లించలేక, వ్యాపారం నడవక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల ఇబ్బందుల వల్ల దేశంలోని దాదాపు 20 శాతం దుకాణాలు మొత్తంగా తెరుచుకునే పరిస్థితులు లేవని అంచనా.
COVID 19 మెగా ప్యాకేజీ: రూ.20 లక్షల కోట్లు ఇలా చేస్తే బెట్టర్!
ఐదో వంతు పూర్తిగా క్లోజ్ కావొచ్చు
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా దాదాపు ఐదోవంతు రిటైల్ షాప్స్ తెరుచుకునే అవకాశం లేదు. అద్దెలు చెల్లించలేక ఇప్పటికే కొంతమంది క్లోజ్ చేశారు. అలాగే లాక్ డౌన్ ఎత్తేశాక ప్రజలు సామాజిక దూరం వంటివి పాటించేందుకు మొగ్గు చూపుతారు. ఇరుకు ప్రాంతాల్లోని షాప్స్ను క్లోజ్ చేసేందుకు యజమానులు మొగ్గు చూపే అవకాశముంటుంది. కరోనా భయం, తనకు కరోనా వస్తే ఫ్యామిలీకి ఇబ్బంది అనే ఒత్తిడిలో కొంతమంది క్లోజ్ చేయవచ్చు.
ఉదాహరణలు ఇవే..
ముంబైలోని కొలబా, నారీమన్ పాయింట్, అంధేరీ, ఢిల్లీలోని ఖాన్ మార్కెట్, కన్నాట్ ప్లోస్, హోల్సేల్ హబ్ సదర్ బజార్లో ఎక్కువగా రిటైల్ షాప్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో దుకాణదారులు అద్దెలు చెల్లించలేకపోతున్నారు. ఇరుకు ప్రాంతాల్లోకి జనాలు రావడానికి భయపడటం వంటి ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో షాప్స్ క్లోజ్ చేయడమే బాగుంటుందని కొంతమంది భావిస్తున్నారట.
20 శాతం మందిపై ఆధారపడి మరో 10 శాతం మంది
ఖాన్ మార్కెట్లో 1,000 స్క్వేర్ ఫూట్ షాప్కు అద్దె రూ.5 లక్షలు, ముంబై బ్రీచ్ కాండీ ప్రాంతంలో రూ.3 లక్షల వరకు ఉంటుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ జనరల్ చెప్పారు. కరోనా-లాక్ డౌన్ కారణంగా 20 శాతం వ్యాపారాలు కుప్పకూలే ప్రమాదముందని, ఇతర వ్యాపారుల్లో 10 శాతం మంది ఈ 20 శాతం మందిపై ఆధారపడి ఉన్నారని, ఈ ప్రభావం వారిపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కస్టమర్ బేస్
ఢిల్లీ ఓల్డ్ మార్కెట్లో అద్దె రూ.4 లక్షల నుండి రూ.5 లక్షలు చెల్లించేందుకు ఇప్పుడు వెనుకాడే పరిస్థితులు వచ్చాయని చెబుతున్నారు. గత మూడు నాలుగేళ్ల దుకాణాలకు కస్టమర్ బేస్ ఉండదని, అదే సమయంలో అద్దె చెల్లించే సామర్థ్యం ఉండదని, కాబట్టి శాశ్వతంగా మూసివేసే ప్రమాదముందని చాందినీ చౌక్ సర్వ్ వ్యాపార్ మండల్ ప్రెసిడెంట్ సంజయ్ భార్గవ అన్నారు.