అలా ఐతే కరెంట్ ఛార్జీల పెరుగుదల, సబ్సిడీలకు ఫుల్స్టాప్: 8న విద్యుత్ ఉద్యోగుల సమ్మె
దాదాపు 15 లక్షల మంది ప్రభుత్వ విద్యుత్ రంగానికి చెందిన ఉద్యోగులు 8 జనవరి 2020న సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం 2003 నాటి విద్యుత్ చట్టానికి చేసిన సవరణలకు గాను వాటిని నిరసిస్తూ ఒక్క రోజు సమ్మె నిర్వహించాలని నిర్ణయించారు. ఇంజినీర్స్ సహా ప్రభుత్వరంగ విద్యుత్ ఉద్యోగులు ఆందరూ ఈ సమ్మెలో పాల్గొననున్నారు.
ప్రయివేటీకరణ కోసమే సవరణ
ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు 2003 నాటి విద్యుత్ చట్టానికి సవరణలు తీసుకు వచ్చారని విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మన దేశంలో విద్యుత్ సరఫరాను ప్రయివేటీకరించడానికి వీలుగా ఈ సవరణ జరిగిందని సంఘాలు అంటున్నాయి. దీనిని నిరసిస్తూ తాము సమ్మె చేపడుతున్నట్లు వెల్లడించాయి.
బిల్లును వెనక్కి తీసుకోవాలి
విద్యుత్ చట్టం 2003ను సవరించాలనే నిర్ణయంతో రైతులు, బలహీనవర్గాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, అందుకే విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ చైర్మన్ శైలేంద్ర దుబే అన్నారు. ఇది ప్రయివేటీకరణకు అనుకూలంగా ఉందని, అదే జరిగితే సబ్సిడీలకు ముగింపు పలుకుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో పవర్ టారిఫ్లు కూడా పెరుగుతాయన్నారు. ఇది మిడిల్ క్లాస్కు కూడా భారంగా మారుతుందన్నారు. రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ బోర్డుల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా 8వ తేదీన విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
వర్క్ బైకాట్
వివిధ ప్రయివేటు పంపిణీ సంస్థలకు లైసెన్స్ జారీ చేయడాన్ని వ్యతిరేకించాలని కోరారు. ఈ ఆందోళన మొత్తం జాతీయ విద్యుత్ ఇంజినీర్లు, ఉద్యోగుల సమస్య కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో సమ్మె/వర్క్ బైకాట్ నిర్వహిస్తున్నట్లు శైలేంద్ర దుబే అన్నారు.