అలాంటి లక్షలాది మందికి రూ.1000 భారమే, వ్యాక్సీన్ ఉచితంగా ఇవ్వండి: మోడీకి లేఖ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సీన్ కోవిషీల్డ్, కోవాగ్జిన్ను దేశంలో అందరికీ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యాక్సీన్ పంపిణీకి నిపుణులతో కూడిన సలహా బృందాలను ప్రధాని నరేంద్ర మోడీ నియమించారు. ఈ బృందాలు వ్యాక్సీన్ పంపిణీకి సంబంధించిన అభిప్రాయాలను వివిధ ప్రాంతాల నుండి సేకరించి, ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. వ్యాక్సీన్ను వివిధ ప్రాంతాలకు రవాణా చేసి, పంపిణీ చేస్తారు.
వ్యాక్సీన్.. ప్రాధాన్యతలు
మొదటి ప్రాధాన్యతగా ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రయివేటు ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీసులకు ఈ వ్యాక్సీన్ అందిస్తారు. రెండో ప్రాధాన్యతగా యాభై సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సీన్ పంపిణీ చేస్తారు. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కోవిడ్ 1 వ్యాక్సీన్ డ్రై-రన్ గురించి అభిప్రాయాలు సేకరించారు. నేటి నుండి (శుక్రవారం, 8) 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో డ్రై-రన్ ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. వ్యాక్సీన్ పంపిణీకి దేశవ్యాప్తంగా 41 నిర్దేశిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పుణేలో సెంట్రల్ హబ్ ఏర్పాటు చేసి వ్యాక్సీన్ అందిస్తారు. ఢిల్లీ, కర్నాల్లో మినీ హబ్స్ ఏర్పాటు చేస్తారు. చెన్నై, హైదరాబాద్ వ్యాక్సీన్ కేంద్రాలుగా ఉంటాయి.
ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి
కరోనా వ్యాక్సీన్ పంపిణీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ బాడీ నోయిడా ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ (NEA) గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి ఓ విజ్ఞప్తి చేసింది. కరోనా వ్యాక్సీన్కు సంబంధించి MSME సెక్టార్లోని లేబర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి ఉచితంగా అందించాలని కోరింది. ఈ మేరకు ప్రధాని మోడీకి లేఖ రాసింది. ఢిల్లీ కేంద్రంగా ఉన్న NEA ఇండస్ట్రీ బాడీలో 6000 ఎంఎస్ఎంఈలు సభ్యులుగా ఉన్నాయి. వ్యాక్సీన్కు రూ.200 నుండి రూ.1,000 వరకు ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
వారికి ఇది భారం
ఎంఎస్ఎంఈ రంగంలో 50 ఏళ్ల లోపు వ్యక్తులు చాలామంది కేవలం రూ.15,000 లోపు వేతనానికి పని చేస్తున్నారని, అలాంటి వారు లక్షలాది మంది ఉన్నారని, వారికి ఉచితంగా వ్యాక్సీన్ అందించాలని NEA ప్రెసిడెంట్ విపిన్ మల్హాన్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. దేశానికి లేబర్ చేస్తోన్న సేవలు అమోఘమని గుర్తు చేశారు. తక్కువ వేతనం ఉండే అలాంటి ఉద్యోగులకు వ్యాక్సీన్ కోసం రూ.1000 భారంగా మారుతుందని చెప్పారు.