మన రూల్స్ అన్నీ ఔట్ డేటెడ్, రెండేళ్లలో 60%: చైనాకు వ్యతిరేకంగా గడ్కరీ
చైనా కంపెనీలకు అనుకూలంగా ఉన్న పాత నిబంధనలను సమీక్షించాల్సి ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. జాతి ప్రయోజనాలు, భారత కంపెనీలు, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తప్పనిసరి అన్నారు. సరిహద్దులో చైనా ఉద్రిక్తతలు తలెత్తేలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఘాటుగానే స్పందిస్తోంది. 59 చైనీస్ కంపెనీల యాప్స్ని నిషేధించింది. రోడ్స్ నిర్మాణంలో చైనా కంపనీలను పక్కన పెడతామని తెలిపింది. పవర్ సెక్టార్కు కావాల్సిన వస్తువులను పాకిస్తాన్, చైనా నుండి దిగుమతి చేసుకోవద్దని రాష్ట్రాలకు లేఖ రాస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
చైనా అవసరం లేదు.. చైనా పెట్టుబడులూ అవసరం లేదు.. మనకూ సత్తా ఉంది
ఆ రూల్స్ అన్నీ ఔట్ డేటెడ్
జాయింట్ వెంచర్లతో సహా హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి చైనా సంస్థలకు అనుమతించేది లేదని ఇప్పటికే నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. చైనా సంస్థలపై తీసుకుంటోన్న నిర్ణయాలను స్వాగతించారు. మన వద్ద ఉన్న నిబంధనలు అన్నీ పాతవి అని, కాంట్రాక్టర్ల కోసం కఠినమైన షరతులు లేదా నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఉదాహరణకు భారీ రహదారులు, వంతెనల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులపై అనుభవం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉందని, మన దేశానికి చెందిన కంపెనీలు ఇదివరకు అలాంటి ప్రాజెక్టులు చేపట్టలేదని, కాబట్టి సొంత కంపెనీలకు ఆ ఒప్పందాలు ఇచ్చేందుకు షరతు అంగీకరించదని, ఆ నిబంధనలు అన్నీ ఔట్ డేటెడ్ అని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఈ కారణాలతో మన వాళ్లు వెనక్కి
మనకు కూడా ప్రాజెక్టులు నిర్మించే సామర్థ్యం ఉందని, కానీ నిబంధనల కారణంగా జాయింట్ వెంచర్స్కు వెళ్లాల్సి వస్తోందని గడ్కరీ అన్నారు. సాంకేతిక కారణాలతో పాటు కొన్ని సంబంధాల్లో ఆర్థిక కారణాలు కూడా ఉంటున్నాయని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చైనా కంపెనీలతో జాయింట్ వెంచర్స్ కలిగిన వాటికి కాంట్రాక్టులు ఇవ్వడం సరికాదని, ఇది జాతి ప్రయోజనాల కోసమని చెప్పారు.
నిన్న చైనా నుండి దిగుమతి.. నేడు ఉత్పత్తి
గడ్కరీ ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడతూ.. సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్ గ్రేడ్ చేసుకోవాలని, విదేశీ పెట్టుబడులు రావాలన్నారు. రెండు నెలల క్రితం మనం చైనా నుండి పీపీఈ కిట్స్ చైనా నుండి దిగుమతి చేసుకున్నామని, ఇప్పుడు మనమే తయారు చేసుకుంటున్నామని చెప్పారు. రోజుకు 5 లక్షల నాణ్యమైన కిట్స్ తయారు చేస్తున్నామన్నారు. ఎగుమతి చేసేందుకు వాణిజ్య మంత్రిత్వ శాఖ అనుమతించాలన్నారు.
48 శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈ
భారత జీడీపీలో ఎంఎస్ఎంఈల కాంట్రిబ్యూషన్ 30 శాతంగా ఉందని గడ్కరీ చెప్పారు. దేశంలో 48 శాతం ఎగుమతులు ఎంఎస్ఎంఈలకు చెందినవి అని, 11 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇది గ్రామీణ పరిశ్రమకు సంబంధించినది అని, గ్రామ పరిశ్రమ టర్నోవర్ మార్చి వరకు 88,000 కోట్లకు చేరుకుందని చెప్పారు. 100 లక్షల కోట్ల మౌలిక సదుపాయాలతో భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేది ప్రధాని మోడీ కల అన్నారు. ఇందులో ఎంఎస్ఎంఈల పాత్ర చాలా ఉంటుందన్నారు.
రెండేళ్లలో 60 శాతానికి...
ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రస్తుతం 48 శాతంగా ఉన్న ఎగుమతుల శాతం రానున్న రెండేళ్లలో 60 శాతానికి చేరుకుంటుందని గడ్కరీ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎంఎస్ఎంఈలకు మంచి సమయమని, టెక్నాలజీని అప్ గ్రేడ్ చేసుకోవాలని, అలాగే ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంీలకు రూ.50,000 కోట్ల ప్రత్యేక స్కీం ప్రకటించిందని, రుణాలు ఇస్తోందని చెప్పారు.