లాక్డౌన్ దెబ్బతో రూ.1.2 లక్షల కోట్లు హుష్కాకి, ఉద్యోగాలు రావాలంటే..
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు క్లోజ్ అయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలు-ఎంఎస్ఎంఈలు కూడా మూతబడ్డాయి. దీంతో ఈ పరిశ్రమ లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యోగాలు పోయాయి. కొన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధించాయి. ఇందుకు కారణం కంపెనీలు మూతబడటం, డిమాండ్ లేకపోవడం.
ఉద్యోగలకు షాక్: తగ్గిన ఈపీఎఫ్ఓ ఆదాయం, పీఎఫ్ వడ్డీ తగ్గే అవకాశం
రూ.1.2 లక్షల కోట్ల లాభాలు ఆవిరి
కరోనా మహమ్మారి - లాక్ డౌన్ కారణంగా ఎంఎస్ఎంఈలు రూ.1.2 ట్రిలియన్ డాలర్ల లాభాలను కోల్పోయాయి. అంటే రూ.1.2 లక్షల కోట్లు నష్టపోయినట్లే. ఈ మేరకు పరిశ్రమ సంఘాలు, అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఉద్యోగాల సృష్టి, రూ.75 కోట్ల నుండి రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీల పునరుజ్జీవం కోసం రోడ్ మ్యాప్ సజెస్ట్ చేశారు.
ఆర్థిక భారం తగ్గించాలి
ఎంఎస్ఎంఈల ఆర్థిక భారం తగ్గించాలని, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేయాలని, ప్రయివేటు యాంకర్ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని, ఎంఎస్ఎంఈ-బ్యాంకుల బాగస్వామ్యం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ అధిపతి, బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ చైర్మన్ రవి వెంకటేషన్ నేతృత్వంలోని గ్లోబల్ అలయెన్స్ ఆఫ్ మాస్ ఎంటర్ప్రెన్యూయర్షిప్(GAME) నివేదిక తెలిపింది.
ఆర్డర్లు తగ్గాయి
డిమాండ్ లేమి కారణంగా ఆర్డర్లు తగ్గాయని 73 శాతం ఎంఎస్ఎంఈలు నివేదించాయి. చెల్లింపులు లేకపోవడంతో ఉత్పత్తి నిల్వలు 15 శాతం పెరిగినట్లు 50 శాతం ఎంఎస్ఎంఈలు తెలిపాయి. దీంతో రూ.75 కోట్ల నుండి రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీలకు రూ.80వేల కోట్ల నుండి రూ.1.2 లక్షల కోట్ల లాభాలు తగ్గిపోయాయని తెలిపింది. ఉద్యోగాల కల్పన కోసం వీటిని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని నివేదిక సూచించింది. స్వల్ప కాలంలో ఈ సంస్థలు మళ్లీ వృద్ధి బాట పట్టేందుకు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని సమర్థంతంగా అమలు చేయాల్సి ఉందని తెలిపింది.