శుభవార్త: ఆంధ్రప్రదేశ్లో కరోనా ముందుస్థాయికి.. వ్యాపారాల జోరు
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ నిన్న చెప్పారు. జీఎస్టీ కలెక్షన్లనుండి విద్యుత్ వినియోగం వరకు రికార్డ్స్థాయిలో పెరిగాయి. తాజాగా, చిన్న వ్యాపారాలు కూడా వేగంగా పుంజుకుంటున్నాయని ఓకే క్రెడిట్ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా భావించే ఎంఎస్ఎంఈల వ్యాపార కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయని, కరోనా ముందు స్థితికి చేరుకుంటున్నాయని ఈ స్టార్టప్(ఓకే క్రెడిట్) తెలిపింది. సామర్థ్యం పెంపుకు, వృద్ధికి డిజిటల్ రిటైలర్లు డిజిటల్ వ్యాపార మార్గాలను అందిపుచ్చుకోవడంలోను దూకుడు కనబరిచినట్లు తెలిపింది.
కరోనా ముందుస్థాయికి వ్యాపారాలు
నివేదిక ప్రకారం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పదహారింట వ్యాపార కార్యకలాపాలు కరోనా ముందుస్థాయికి మించి చేరుకున్నాయి. ఇక కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలలో 90 శాతం నుండి 95 శాతానికి చేరుకున్నాయి. బీహార్, హర్యానా, అసోం, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో 10 శాతం ఎక్కువే ఉంది. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో బిజినెస్ కార్యకలాపాలు ఎక్కువే ఉన్నాయి.
టైర్ 1 కంటే ఈ నగరాలు వేగం
2 టైర్, 3 టైర్ నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు చాలా వేగంగా పుంజుకున్నాయి. టైర్ 1 నగరాల కంటే పై నగరాల్లో వేగవంతమయ్యాయి. మైక్రో రిటైల్ వ్యాపారులు డిజిటల్ వైపు దృష్టి సారించారు. 2020 సెప్టెంబర్ నెలలో ఔషధ, కిరాణా దుకాణాల వ్యాపారాల్లో వృద్ధి వరుసగా 21శాతం, 15 శాతం పుంజుకుంది. వీటిలో డబుల్ డిజిట్ గ్రోత్ నమోదయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోను ఓక్ క్రెడిట్ యాప్ను వినియోగిస్తున్నారు.
డిజిటల్ వ్యాపార విధానాల వైపు
ఎంఎస్ఎంఈలు సామర్థ్యాలు పెంచుకోవడంతో పాటు వృద్ధిబాట పట్టడానికి డిజిటల్ వ్యాపార విధానాలను ఆశ్రయిస్తున్నాయని ఓకే క్రెడిట్ తన నివేదికలో పేర్కొంది. 2800 నగరాలు, సమీప గ్రామీణ ప్రాంతాల్లో 5.5 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారులు ఓక్ క్రెడిట్ ఉపయోగిస్తున్నారు. కాగా, కరోనా కారణంగా ఢీలాపడిన ఆర్థిక వ్యవస్థ కుదురుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు.