ఎంఎస్ఎంఈలకు ఆందోళనకరమే: ఉద్యోగాల కాపాడటం కోసం ప్రభుత్వం చేయాల్సింది ఇదీ!
2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ భారీగా క్షీణించనున్న నేపథ్యంలో భారత కార్పోరేట్ ఆదాయంలో 15 శాతం క్షీణతకు దారితీయవచ్చునని, ఇది చిన్న వ్యాపారాల అస్తిత్వానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని సోమవారం ఓ నివేదిక తెలిపింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఆర్థికమంత్రిత్వ శాఖ విధాన పరమైన ప్రకటనలు కొంత ఆశలు కల్పిస్తున్నప్పటికీ, అది సరిపోదని అభిప్రాయపడింది. ఈ ప్రకటనలు డిమాండ్ను సమీప భవిష్యత్తులో పునరుద్ధరించలేవని తెలిపింది. ప్రభుత్వం, ఆర్బీఐ జోక్యం చిన్న వ్యాపారాలకు ఎంతో కీలకమని ఈ నివేదిక పేర్కొంది.
చైనాకు వెళ్లాలంటేనే ఇక భయం, అక్కడి కంపెనీ కోసం భారత్ వద్ద ఉన్న ఆయుధం ఇదే!
21 శాతం వరకు నష్టం
ఈ నివేదిక ప్రకారం... కరోనా - లాక్ డౌన్ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) రంగం ఆదాయంలో 21% వరకు నష్టాలు ఉండవచ్చు. అదే సమయంలో వివిధ కారణాల వల్ల ఆపరేటింగ్ లాభాలు 4 శాతం నుండి 5 శాతం తగ్గుతాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ 5 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేస్తోంది.
లాక్ డౌన్ నేపథ్యంలో చిన్న సంస్థలను, వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం, ఆర్బీఐ రూ.3 లక్షల కోట్ల హామీలేని రుణాలతో పాటు వివిధ చర్యలు ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈల ఆదాయంలో ఐదు శాతం మేర తగ్గవచ్చునని అంచనా. ఆపరేటింగ్ స్థాయిలో ఆదాయం తగ్గుదల క్రెడిట్ యోగ్యతపై ప్రభావం చూపుతుంది. తక్కువ వస్తువుల ధరల నుండి లాభాలు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో బలహీనమైన డిమాండ్ కారణంగా చిన్న వ్యాపార విభాగం వాటిపై పెట్టుబడి పెట్టలేకపోతోందని ఈ నివేదిక తెలిపింది.
ఈ రుణాలదే 32 శాతం వాటా
మొత్తం ఎంఎస్ఎంఈ రుణాల్లో మైక్రో ఎంటర్ప్రైజెస్ రుణాల వాటానే 32 శాతంగా ఉంది. ఇవి ఆదాయ వృద్ధి, నిర్వహణ లాభాలు, వర్కింగ్ క్యాపిటల్ రూపంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఈ నివేదిక తెలిపింది. కరోనా కంటే ముందు ప్రభావం కారణాలతో సూక్ష్మ, చిన్న సంస్థలు కూడా మధ్యతరహా, పెద్ద సంస్థల వలె మూలధన సవాళ్లను ప్రస్తుత పరిస్థితుల్లో సులభంగా ఎదుర్కోలేకపోతున్నట్లు తెలిపింది.
డిమాండ్ పెంచే విధానాలు అవసరం
ఆర్బీఐ, ఆర్థికమంత్రిత్వ శాఖల జోక్యం దెబ్బతిన్న నగదు ప్రవాహం నేపథ్యంలో వారికి సహకరిస్తాయని ఈ నివేదిక తెలిపింది. వీటికి అతిపెద్ద ఆందోళనకరమైన అంశం డిమాండ్ను పునరుద్ధరించాల్సి రావడమని తెలిపింది. ఏది ఏమైనా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంచే విధానాలు అవసరమని తెలిపింది. ఇప్పటి వరకు ప్రకటించిన ప్యాకేజీ డిమాండ్ను ఆశించిన మేర పునరుద్ధరించేలా లేదని తెలిపింది. కాగా, కేంద్రం ప్యాకేజీ సుదీర్ఘకాలంలో ఉపయోగపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తోన్న విషయం తెలిసిందే.
భారీగా డిమాండ్ను పెంచేలా లేదు
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రకటించిన ప్యాకేజీ సమీప కాలంలో డిమాండ్ను పెంచేలా లేదని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ మెహతా అన్నారు. వినియోగాన్ని పెంచడం ద్వారా సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉద్యోగ భద్రత సెంటిమెంట్ పెరుగుతుందని, ఎంఎస్ఎంఈలకు ద్రవ్యలభ్యత కోసం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయడం, రుణాల అంశాలు కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఈపీసీ విభాగంలో ఎంఎస్ఎంఈ ఆదాయంపై దాదాపు సగం ప్రభావం పడుతుందని చెబుతున్నారు.