వీటితోనే ఎక్కువమందికి ఉద్యోగాలు, వడ్డీ రేట్ల కోతను గమనిస్తున్నాం: నిర్మలా సీతారామన్
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలు అమలు అవుతున్నాయా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన రెపోరేట్ల కోతకు అనుగుణంగా కంపెనీలు, వినియోగదారులకు వడ్డీ రేట్లను బ్యాంకులు ఎలా తగ్గిస్తున్నాయనే అంశాన్ని తాము పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. PHD చాంబర్ ఆఫ్ కామర్స్, వాణిజ్య రంగ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
IBMతో కలిసి పని చేయనున్న టెక్ దిగ్గజం TCS, ఎందుకంటే
MSMEల ద్వారా ఎక్కువ మందికి ఉపాధి
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను (MSME) కాపాడితేనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందనేది ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసమని నిర్మలమ్మ చెప్పారు. ఆ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రూ.3 లక్షల కోట్ల రుణాలు ఎలా అందిస్తున్నారో కూడా సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, వ్యాపారాన్ని సులభతరం చేయడం వంటి వాటికి సిద్ధంగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈలు సహా ప్రభుత్వం అన్ని పరిశ్రమలకు సమానంగా తోడ్పడుతుందన్నారు. అలాగే బ్యాంకులు రుణ రేటు తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు ఇస్తారని హామీ ఇచ్చారు.
ఉద్యోగాల సృష్టి
దేశంలో ఉద్యోగాల సృష్టికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని, తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. గరిష్ట పాలన, కనీస ప్రభుత్వ జోక్యం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భారత పరిశ్రమలో మంచి ఆర్థిక అభివృద్ధి కోసం మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడానికి టెక్నాలజీ అప్ గ్రేడ్ను రూపొందించేందుకు ఈ చాంబర్ చేసిన సూచనలను ఆర్థికమంత్రి అంగీకరించారు.
రేట్ల కోత క్రమంగా మెరుగుపడుతోంది
రేట్ల కోత ప్రయోజనాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదలీ చేయడం క్రమంగా మెరుగుపడుతోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గత నెలలో ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. తద్వారా 4 శాతానికి చేరుకుంది.రూ.21 లక్షల కోట్ల ఉద్దీపనతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల ఎంతో ప్రయోజనమని PHD చాంబర్ పేర్కొంది. పర్యాటక, విమానయాన, వినోద, స్థిరాస్తి వాహన రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నందున, ఆయా రంగాలకు ఇచ్చిన రుణాల వర్గీకరణలో తేడా లేకుండా పునర్ వ్యవస్థీకరించాలని సూచించింది.