సంస్థలు, ఉద్యోగులపై తీవ్రఒత్తిడి: మారటోరియం మళ్లీ పొడిగిస్తే
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. గత నెల నుండి కోలుకుంటున్నప్పటికీ కంపెనీల నుండి ప్రజల నుండి కోలుకోవడానికి ఆరు నెలల నుండి ఏడాది సమయం పట్టవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియం మరోసారి పొడిగించడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మారటోరియం వల్ల భవిష్యత్తులో మరింత భారంగా మారుతుందని లెక్కలు వేసుకుంటున్న చాలామంది చేతిలో నగదు ఉంటే దీనిని ఉపయోగించుకోవడం లేదు. కచ్చితంగా అవసరమైన వారు లోన్ మారటోరియంకు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మారటోరియం మరోసారి పొడిగిస్తే అవసరమైన వారికి మరింత ఊరట కలుగుతుందంటున్నారు.
మాకొద్దు ఈ అదనపు భారం.. ఈఎంఐలు చెల్లిస్తాం: ముందే మారటోరియం నుండి వెనక్కి
అవసరమైతేనే మారటోరియం కాబట్టి
మారటోరియం తాత్కాలిక ఊరట మాత్రమే. ఆ తర్వాత ఈఎంఐ పెరగడమో లేక కాలపరిమితి పెరగడమో ఉంటుంది. అంటే ఇది భారమే. కాబట్టి ఇప్పటికే చాలామంది మారటోరియంకు దూరంగా ఉన్నారు. గత నెలనుండి కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుండి మరికొంతమంది దూరం జరుగుతున్నారు. కోలుకోవడానికి సమయం పట్టే కంపెనీలకు, ఉద్యోగం పోయి ఇబ్బందుల్లో ఉన్నవారికి లేదా వేతనాలు లేని సెలవుల్లో ఉన్న వారికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మారటోరియం పొడిగింపు వల్ల అత్యవసరమైన వారు ఉపయోగించుకుంటారు కాబట్టి ఇరువైపులా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
సంస్థలు, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది
ఎందుకంటే మారటోరియం అవకాశం పొడిగించకుంటే.. తమ కంపెనీలకు ఆదాయం లేక అలాగే ఉద్యోగుల చేతిలో డబ్బులు లేక.. ఈఎంఐ కట్టకుంటే మున్ముందు టెక్నికల్ ఇబ్బంది తలెత్తుతుందనే ఆందోళన మరింత ఒత్తిడిని కలిగిస్తుంది. ఈఎంఐ కట్టకుంటే క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. ఇది చాలామందికి ఆందోళన కలిగించే అంశం. కనీసం మారటోరియం పొడిగింపు వల్ల ఎంతోమందిని ఆ ఒత్తిడి నుండి తప్పించవచ్చునని చెబుతున్నారు.
కోలుకోవడంపై నిపుణుల మాట.. ఊరట
తొలుత మార్చి నుండి మూడు నెలల పాటు కల్పించిన ఈ వెసులుబాటు ఆ తర్వాత ఆగస్ట్ వరకు పొడిగించారు. సంస్థలు, ఉద్యోగులు చాలావరకు కోలుకోవడానికి మూడు నెలల నుండి ఆరు నెలలు.. ఏడాది పట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారని, కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొనే వారికి డిసెంబర్ వరకు పొడిగిస్తే ఎంతో ఊరట లభిస్తుందని చెబుతున్నారు. ప్రధానంగా ఎంఎస్ఎంఈ, చిన్న సంస్థలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.
అందుకే మారటోరియం పొడిగించాలి
ప్రపంచవ్యాప్తంగా కరోనా అదుపులో లేదనే చెప్పవచ్చు. కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సీన్ ఎప్పటికి వస్తుందో తెలియదు. ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇచ్చినా వ్యాపారాలపై ఆంక్షలు, ప్రయాణాలపై ఆంక్షలు డిమాండ్ను తగ్గిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ముందు ఉన్న ప్రత్యామ్నాయం మారటోరియం పొడిగింపు అంటున్నారు. కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోక ముందే మారటోరియం ఆగస్ట్లో క్లోజ్ అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే రుణఖాతాల్లో చాలా వరకు ఎన్పీఏలుగా మారే ప్రమాదం ఉందని బ్యాంకర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.