New Deposit Rules: మారిన ఈ క్యాష్ డిపాజిట్ రూల్స్ మీకు తెలుసా? టాక్స్ అధికారులు గమనిస్తారు.. ఎంత జరిమానా..
New Deposit Rules: చట్టవిరుద్ధమైన, లెక్కల్లోకి రాని నగదు లావాదేవీలను అరికట్టడానికి, ప్రభుత్వం నగదు పరిమితి నిబంధనలను సవరించింది. పరిమితికి మించి నగదు చెల్లించడం లేదా స్వీకరించడం అనేది చెల్లించిన లేదా స్వీకరించిన మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించబడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ రూపొందించిన కొత్త నియమాల ప్రకారం.. ఏడాదికి రూ.20 లక్షలకంటే ఎక్కువ డిపాజిట్ చేసే వ్యక్తులు ఇకపై ఆధార్, పాన్ వివరాలను తప్పక సమర్పించాలి.
పాన్ కార్డు లేకపోతే..
ఒకటి లేదా అనేక బ్యాంకుల్లో ఒక వ్యక్తి చేసే అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్లను టాక్స్ అధికారులు పాన్, ఆధార్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. పాన్ లేని వ్యక్తులు రోజుకు రూ.50,000 కంటే ఎక్కువ లేదా ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కంటే ఎక్కువ ఏదైనా లావాదేవీని నమోదు చేయడానికి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆర్థిక నేరాలు పెరుగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.
బంధువుల వద్ద కూడా..
అధిక విలువ లావాదేవీల్లో నగదు వినియోగాన్ని నియంత్రించడానికి రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్లను డబ్బు రూపంలో స్వీకరించడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. కాబట్టి.. ఒక వ్యక్తి తన దగ్గరి కుటుంబం నుంచి కాకుండా రూ.2 లక్షల కంటే ఎక్కువ మెుత్తాన్ని డబ్బు రూపంలో తీసుకోకూడదు.
నల్లధనాన్ని అరికట్టేందుకు కేంద్రం తెచ్చిన నగదు నిబంధనలు ఇవే..
1. దేశంలోని ఆదాయపు పన్ను చట్టాలు ఏ కారణం చేతనైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయటాన్ని నిషేధించాయి. ఉదాహరణకు.. మీరు రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లయితే.. మీరు తప్పనిసరిగా చెక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా బ్యాంక్ ట్రానాక్షన్ ద్వారా మాత్రమే చెల్లింపు చేయాలి.
2. మీరు ఎవరైనా కుటుంబ సభ్యుల నుంచి డబ్బును స్వీకరించినప్పటికీ.. మీరు తప్పనిసరిగా పైన సూచించిన మార్గదర్శకాన్ని అనుసరించాలి.
3. ఒక వ్యక్తి రోజుకు బంధువుల నుంచి రూ.2 లక్షల కంటే ఎక్కువ మెుత్తంలో డబ్బును తీసుకోలేరు. ఎందుకంటే నగదు వినియోగంపై ప్రభుత్వం పరిమితి విధించింది కాబట్టి. ఇది ఉల్లంఘిస్తే 100 శాతం జరిమానా ఉంటుంది.
4. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను నగదు రూపంలో చెల్లిస్తే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 80D కింద టాక్స్ మినహాయింపులు పొదలేరు. చెల్లింపులు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మాత్రమే జరగాల్సిన అవసరం ఉంది.
5. ఒక వ్యక్తి ఆర్థిక సంస్థ లేదా స్నేహితుడి నుంచి నగదు రూపంలో రూ.20 వేల కంటే ఎక్కువ డబ్బు తీసుకోవటానికి వీల్లేదు. దానిని తిరిగి చెల్లించటం బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారానే చేయాల్సి ఉంటుంది.
6. ఆస్థి లావాదేవీల్లో సైతం కేవలం రూ.20 వేలు నగదు రూపంలో చెల్లింపులు చేసేందుకు గరిష్ఠంగా అనుమతి ఉంది.
7. స్వయం ఉపాధి పన్ను చెల్లింపుదారుల విషయానికి వస్తే.. ఒకే రోజులో ఒకే వ్యక్తికి నగదు రూపంలో రూ.10 వేల కంటే ఎక్కువ చెల్లించినట్లయితే దానిని క్లెయిమ్ చేయలేరు. ట్రాన్స్పోర్టర్కి మాత్రం ఈ లిమిట్ అత్యధికంగా రూ.35 వేలను చట్టం అనుమతించింది.