scrappage policy: రోడ్ ట్యాక్స్ రాయితీపై ప్రోత్సాహకాలు, వాహనదారులకు షాక్స్
వెహికిల్ స్క్రాపేజీ పాలసీ(తుక్కు)లో మరో కీలక అంశం. స్క్రాపేజీ పాలసీని మరింత ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పాత వాహనాలను స్క్రాపేజీకి ఇచ్చేసి, కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్లో 25 శాతం దాకా రిబేట్ ఇవ్వనున్నట్లు తెలిపింది.
స్క్రాపేజీ సర్టిఫికేట్ సమర్పించిన వారికి రోడ్ ట్యాక్స్లో 25 శాతం కన్సెషన్ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇస్తాయన్నారు. ఈ ప్రోత్సాహక విధానాన్ని ఏప్రిల్ 1, 2022 నుండి అమలులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
పన్నులో రాయితీ
'స్క్రాపేజీ ఇన్సెంటివ్లో భాగంగా రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపేజీ ఫెసిలిటీ ద్వారా జారీ చేయబడిన డిపాజిట్ సర్టిఫికెట్ను సమర్పిస్తే కొత్త వాహనం కోసం మోటార్ వాహన పన్నులో రాయితీ ఉంటుంది' అని సంబంధిత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పన్ను రాయితీ నాన్-ట్రాన్సుపోర్ట్ వాహనాలు (పర్సనల్) అయితే 25 శాతం, ట్రాన్సుపోర్ట్ (కమర్షియల్) అయితే 15 శాతం ఉంటుందని పేర్కొంది. ఈ రాయితీ రవాణా వాహనాల విషయంలో ఎనిమిది సంవత్సరాల వరకు, నాన్-ట్రాన్సుపోర్ట్ వెహికిల్స్కు పదిహేనేళ్ల వరకు ఉంటుందని స్పష్టం చేసింది.
ఉద్గారాల తగ్గుదల
ఈ పాలసీ 2022 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజీ విధానాన్ని ఈ ఏడాది ఆగస్ట్ నెలలో ఆవిష్కరించారు. దీని ప్రకారం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుండి భారీ కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ తప్పనిసరి. మిగతా కేటగిరీల వాహనాలకు 2024 జూన్ 1వ తేదీ నుండి దశలవారీగా అమలు చేస్తారు. ఈ విధానం ఆటోమొబైల్ రంగానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని, అలాగే పర్యావరణహితంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే పాత వాహన స్క్రాపేజీ విధానం వల్ల ఉద్గారాలు తగ్గుతాయి. స్క్రాపేజీ విధానం ప్రకారం 15 ఏళ్లు పైబడిన కమర్షియల్ వాహనాలు, 20 ఏళ్లు పైబడిన పర్సనల్ వెహికిల్స్కు వర్తిస్తుంది.
ప్రోత్సాహకాలు.. డిస్-ఇన్సెంటివ్స్
- పాత వాహనాలను స్క్రాపేజీకి ఇచ్చేసి, కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారికి 25 శాతం కన్సెషన్ ఉంటుంది.
- రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్ (CoD) ద్వారా కొత్త వాహనం కోసం రిజస్ట్రేషన్ సర్టిఫికెట్తో రుసుము మినహాయింపు ఉంటుంది.
స్క్రాపేజీకి ఇవ్వకుంటే డిస్-ఇన్సెంటివ్స్
- ఫిట్నెస్ టెస్ట్ ఫీజు మరింత పెంపు. పదిహేను సంవత్సరాల కంటే పైగా ఉన్న వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరణ ఫీజు పెంచుతారు.
- పదిహేనేళ్లు దాటిన ట్రాన్సుపోర్ట్ వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికేషన్ ఫీజు పెంపు.
- పదిహేను సంవత్సరాలు దాటిన పాత పర్సనల్ వెహికిల్స్ (నాన్-ట్రాన్సుపోర్ట్ వాహనాలు) రిజిస్ట్రేషన్ రెన్యూవల్ పెంపు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ను సమర్పిస్తూ స్వచ్చంధ స్క్రాపేజీ విధానాన్ని ప్రకటించారు. నిర్మలమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దీనిని అమలు చేయనున్నారు.