విజయవాడవాసులకు శుభవార్త, ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్
విజయవాడ: బెజవాడ ప్రజలకు ఆర్టీసీ గుడ్ న్యూస్. ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఈ రీజియన్లో డోర్ టు డోర్ కొరియర్ సర్వీసును అందించనుంది. ఆర్టీసీలో పార్సిల్ సర్వీస్ తెలిసిందే. అయితే కొరియర్ చేస్తే సంబంధిత బస్టాండ్కు వెళ్తే తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని భారీ పార్శిల్స్, రెగ్యులర్ పార్శిల్స్ ఉంటే ఆర్టీసీనే డోర్ డెలివరీ చేస్తుంది. గార్మెంట్ హోల్ సేల్ డెలివరీ, కూరగాయల వ్యాపారులు ఇలాంటి సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. చిన్న చిన్న కొరియర్లు కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు.
జగన్ ప్రభుత్వం నిర్ణయం, ప్రజలపై రూ.700 కోట్ల భారం! ఆర్డినరీలో మినిమం ఛార్జ్ రూ.10
కొరియర్ సేవలు
ఆర్టీసీ విజయవాడ రీజియన్ త్వరలో కొరియర్ డోర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే పార్శిల్ సేవలకు మంచి ఆదరణ ఉంది. ఆర్టీసీ అధికారులు కొన్నాళ్లుగా బల్క్ పార్సిళ్లకే డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. దీనిని చాలామంది వినియోగించుకుంటున్నారు. పార్సిల్ సేవలు ఆదరణ పొందాయని, ఈ రీజియన్లో కొత్తగా కొరియర్ సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నామని ఆర్టీసీ విజయవాడ రీజియన్ ఆర్ఎం అన్నారు.
పార్సిల్ కోసం...
ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (APSACS), మెడ్ ప్లస్, అపోలో (మెడిసిన్స్), బ్రిడ్జిస్టోన్ (టైర్స్) వంటి సంస్థలు ఆర్టీసీ పార్సిల్ సేవలను ఉపయోగించుకుంటున్నాయి. విద్యాశాఖ పుస్తకాల రవాణాకు కూడా ఆర్టీసీని ఎంచుకున్నాయి. ఈ పార్సిళ్లను సంబంధిత వ్యక్తులు/సంస్థలకు పంపించేందుకు రీజియన్లో ప్రత్యేకంగా ఒక వ్యాన్, రెండు ఆటోలు ఉన్నాయి. సరుకు ఎక్కువగా వస్తే డిపో గూడ్స్ ట్రాన్స్పోర్ట్ (డీజీటీ) వాహనాలను వినియోగిస్తున్నారు.
ఛార్జ్ ఎంత అంటే?
ఈ వస్తువులను నగర పరిధిలో డెలివరీ చేసేందుకు రూ.50 కిలోల వరకు రూ.20, క్వింటాల్కు రూ.300 వరకు ఛార్జ్ చేస్తున్నారు. డిమాండ్ ఉండటంతో విజయవాడ, మచిలీపట్నం, గుడివాడల్లో జూలై నుంచి కోరిన వారందరికీ డోర్ డెలివరీ అందుబాటులోకి వచ్చింది. పార్సిల్ వచ్చిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వినియోగదారుడికి ఫోన్లో చెబుతారు. వారు తమకు డోర్ డెలివరీ చేయమని కోరితే నిర్ణీత ఛార్జ్ వసూలు చేస్తారు. ఛార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువ మంది ఆర్టీసీ పార్శిల్ వైపు మొగ్గు చూపుతున్నారు.
అందుకే కొరియర్ సేవల్లోకి
పార్శిల్ ద్వారా ఆశించిన ఫలితాలు ఉండటంతో విజయవాడ రీజియన్ అధికారులు కొత్తగా కొరియర్ డెలివరీ సేవల్లోకి అడుగు పెట్టాలని భావిస్తున్నారు. ఇతర సంస్థల్లా కొరియర్ కవర్లను బుక్ చేసి, డోర్ డెలివరీ చేస్తారు. ఆర్టీసీ సర్వీసులు పట్టణాలు, నగరాలతో పాటు మారుమూల పల్లెలకు వెళ్తున్నందున కొరియర్ సర్వీసుకు కూడా ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు కొరియర్ డెలివరీ సేవలు అందుబాటులో లేవు. గత ఏడాది పార్సిల్ రవాణా ద్వారా విజయవాడ రీజియన్ రూ.12 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది రూ.15 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది.
ఆధునిక టెక్నాలజీ
సరుకు రవాణాలో ఆర్టీసీ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. దీంతో వెంటనే సరుకు డెలివరీ చేయగలుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్సిల్స్ను రీజినల్ ఆఫీస్లోని పార్సిల్ విభాగానికి తరలిస్తారు. అక్కడ వాటికి నెంబరు కేటాయించి నిర్దేశిత ర్యాంకుల్లో ఉంచుతారు. వాటిని ఫొటోలు తీసి కంప్యూటర్కు అనుసంధానిస్తారు. కస్టమర్ పార్సిల్ తీసుకెళ్లడానికి వస్తే, స్కాన్ ద్వారా ఆ పార్సిల్ ఎక్కడుందో తెలిసిపోతుంది. దీంతో కొద్ది నిమిషాల్లోనే దానిని అందిస్తున్నారు. సరుకు ట్రాకింగ్ విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. దీంతో కస్టమర్ బుక్ చేసిన పార్సిల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.