అందుబాటులోకి RBI లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ: అర్హత ఏమిటంటే?
కరోనా వైరస్ నేపథ్యంలో గత ఏడాది కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. 2020 మార్చి నుండి ఆగస్ట్ వరకు రుణ మారటోరియానికి అవకాశమిచ్చారు. కరోనా పరిస్థితుల్లో ఇది ఎంతోమందికి ఊరటను కల్పించింది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆర్బీఐ రుణాల చెల్లింపుపై రెండో విడత మారటోరియాన్ని అందుబాటులోకి తెచ్చింది.
లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీని తీసుకు వచ్చింది. రుణ గ్రహీతలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని బ్యాంకర్లకు సూచించింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ప్రజలు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు.
వీరికి లోన్ రీస్ట్రక్చరింగ్
లోన్ రీస్ట్రక్చరింగ్ నేపథ్యంలో రుణగ్రహీతలు తమ రుణాన్ని రీస్ట్రక్చర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే దీనికి బ్యాంకు నుండి ముందుగానే అనుమతి తీసుకోవాలి. అంటే లోన్ రీస్ట్రక్చర్ కోసం రుణగ్రహీత బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి.
రూ.25 కోట్ల వరకు రుణాలు తీసుకున్న వ్యక్తులు, చిన్న వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వర్తిస్తుంది. గత ఏడాది రుణ పునర్వ్యవస్థీకరణ ఫ్రేంవర్క్ కింద దరఖాస్తు చేసుకోని వారికి కూడా వర్తిస్తుంది. మొదటి లోన్ మారటోరియం సద్వినియోగం చేసుకున్న రుణగ్రహీతలకు వర్తిస్తుంది.
వీరూ పొడిగించుకోవచ్చు
గత ఏడాది లోన్ మారటోరియం వెసులుబాటును మార్చి నుండి మే వరకు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఆగస్ట్ నెల వరకు పొడిగించింది. ఆ తర్వాత రుణగ్రహీతలు తమ బ్యాంకర్లతో సంప్రదించి రెండేళ్ల వరకు రుణ పునర్వ్యస్థీకరణ ద్వారా మారటోరియం వెసులుబాటు ఉపయోగించుకోవచ్చునని తెలిపింది.
డిఫాల్టర్ ముద్ర లేకుండా
మారటోరియం నిబంధన వల్ల రుణ గ్రహీతపై డిఫాల్టర్ ముద్ర పడకుండా నివారించుకోవచ్చు. డీఫాల్ట్గా మారితే రుణవాయిదా చెల్లింపులు పెరిగి, క్రెడిట్ స్కోర్ పైన ప్రభావం పడుతుంది. తొలి మారటోరియం పొందిన వారు కూడా రెండేళ్ల వరకు మిగతా రుణ వాయిదాలను పొడిగించుకోవచ్చు.