ఎవరైనా పెట్రోల్ బంక్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.. కండిషన్స్ ఇవే! అలా చేయకుంటే రూ.3 కోట్ల ఫైన్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంధన సరళీకృత చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల సంఖ్య పెంచేందుకు ఇంధనేతర కంపెనీలకూ లైసెన్స్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ఇంధన రిటైల్ నూతన సరళీకృత విధానాల్లో వివిధ షరతులు ఉన్నాయి. పెట్రోల్ బంకులు ఎన్ని ఉండాలి, ఎక్కడెక్కడ వాటిని నిర్వహించాలనే వివిధ నిబంధనలు ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం నడిస్తేనే కొత్త సంస్థలకు అవకాశం ఇస్తారు.
వాహనదారులకు శుభవార్త: ఇక సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్లలో పెట్రోల్, డీజిల్!
కనీసం 100 బంకులు, 5 శాతం మారుమూల ప్రాంతాల్లో...
రిటైల్ పెట్రోల్ పంపుల గెజిటే నోటిఫికేషన్ ప్రకారం.. కనీసం 100 పెట్రోల్ బంకులు నెలకొల్పాలి. ఇందులో 5 శాతం మారుమూల ప్రాంతాల్లో ఉండాలి. అలాగే, కంప్రెస్డ్ నేచరల్ గ్యాస్ (CNG), బయోఫ్యూయల్, లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్, ఎలక్ట్రిక్ వెహిల్ చార్జింగ్ వంటి న్యూ జనరేషన్ ఇంధన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. మూడేళ్లలో ప్రతిపాదిత రిటైల్ అవుట్ లెట్లలో వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
ఇది వరకు ఆ పెద్దలకే...
ఇప్పటి వరకు పెట్రోల్ బంకులు నిర్వహించేందుకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు డీలర్షిప్స్ జారీ చేసేవి. రిలయన్స్, ఎస్సార్, షెల్ వంటి ప్రయివేటు సంస్థలు జారీ చేశాయి. అయితే వీటిని నిర్వహించేందుకు కర్భణ ఇంధనాల వెలికితీత, ఉత్పత్తి, చమురు శుద్ధి, పైప్ లైన్లు, ఎల్ఎన్జీ రంగాల్లో రూ.2000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం వీటిలో ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది.
రూ.25 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు...
రూ.250 కోట్ల నికర వ్యాల్యూ కలిగిన ఏ కంపెనీ అయినా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్ కోరుకునే విధంగా మోడీ ప్రభుత్వం మార్పులు చేసింది. కేంద్రానికి రూ.25 లక్షలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే అప్లికేషన్ ఫాం ధర రూ.25 లక్షలు. ఈ సంస్థలు దేశంలో కనీసం 100 పెట్రోల్ బంకులు, 5 శాతం గుర్తించిన మారుమూల ప్రాంతాల్లో అయిదేళ్లలోపు వాటిని నెలకొల్పాలి.
మూడేళ్లలో ఇవి నెలకొల్పాలి
కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలోపు CNG, బయో ఇంధనాలు, ఎల్ఎన్జీలలో కనీసం ఒకటైనా విక్రయించేందుకు, విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లకు అవకాశం ఇవ్వాలి. ప్రపంచ చమురు దిగ్గజాలైన ఫ్రాన్స్ SA, సౌదీ అరేబియా ఆరామ్కో, యూకేకు చెందిన బీపీ వంటి సంస్థలు వచ్చేందుకు కూడా ఇది తోడ్పడుతుంది.
దేశంలో పెట్రోల్ బంకులు ఇలా...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థలకు 66,408 పెట్రోల్ బంకులు ఉన్నాయి. రిలయన్స్ 1400, నయారా 5453, షెల్ 167 పెట్రోల్ బంకులు కలిగి ఉంది. 3500 పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం BP రెండు మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకుంది. గత ఏడాది అదానీ గ్రూప్ 1500 పెట్రోల్ బంకుల కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ అవి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రిలయన్స్తో కలిసి మొత్తం 5500కు పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం IOC 28,237 పెట్రోల్ పంపులతో ముందుంది. ఆ తర్వాత HPCLకు 15,855, BPCLకు 15,289 బంకులు ఉన్నాయి.
ఇష్టం లేకుంటే ముందే చెప్పవచ్చు...
మారుమూల ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం ఇష్టం లేకుంటే దరఖాస్తు సమయంలోనే ఒక్కో దానికి రూ.2 కోట్లు చెల్లించి మినహాయింపు కూడా పొందవచ్చు. కానీ వీటికి అంగీకరించి, గడువులోగా నిర్వహించకుంటే మాత్రం ఒక్కో దానికి రూ.3 కోట్ల చొప్పున ఫైన్ వేస్తారు.