కరోనా మహమ్మారి కారణంగా కస్టమర్లకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఆయా రంగాలు లేదా సంస్థలు అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా నేపథ్యంలో బ్యాంకులు కార్డ్లెస్ ట్రాన్సాక్షన్స్ వంటి వాటికి ప్రాధాన్యతను ఇచ్చాయి. అలాగే ఇన్సురెన్స్ రెగ్యులేటర్ ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(IRDAI) కూడా జీవిత, సాధారణ బీమా పాలసీలు జారీ చేసేందుకు వీడియో ఆధారిత కేవైసీ(Know Your Customer)ని ఉపయోగించుకునేందుకు బీమా సంస్థలకు అనుమతి ఇచ్చింది.

పాలసీల విక్రయానికి ఇబ్బందులు
కరోనా కారణంగా పాలసీదారులను వ్యక్తిగతంగా కలిసేందుకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగతంగా కలిసే వీలు లేకుండా పోయింది. దీంతో బీమా సంస్థలు పాలసీలను విక్రయించేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దీనిని నివారించేందుకు ఈ వీడియో ఆధారిత కేవైసీ ఉపకరిస్తుంది. ఇప్పటికే ఆర్బీఐ కేవైసీ నిబంధనల విషయంలో మార్పులు చేసింది. వీడియో కేవైసీకీ పచ్చజెండా ఊపింది.

వీడియో కేవైసీ
కేవైసీని సరళీకృతం చేయడంతో పాటు అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ మార్గాలను ఉపయోగించుకోవచ్చునని బీమా సంస్థలకు IRDAI అనుమతి ఇచ్చింది. వ్యక్తిగత గుర్తింపుగా దీనిని ఉపయోగించుకునేందుకు కేవైసీ నిర్వహించే వ్యక్తి వీడియోను రికార్డు చేయడం, ఫోటోలను తీసుకోవడం వంటివి చేయవచ్చునని తెలిపింది. బీమా సంస్థలు ఒక యాప్ను అభివృద్ధి చేసి, వీడియో కేవైసీని నమోదుచేసే ప్రక్రియను చేపట్టే వీలును పరిశీలించాలని సూచించింది.

కాగితపు వర్క్ తగ్గడం, తక్కువ సమయం
వీడియో ఆధారిత ఐడెంటిఫికేషన్ కేవైసీ ప్రధాన లక్ష్యం కస్టమర్తో కనీస కాగితపు పనిని తగ్గించడం, అలాగే సాధ్యమైనంత తక్కువ సమయంలో పూర్తవుతుంది. వీడియో ఆధారిత కేవైసీ ప్రక్రియతో పూర్తి కేవైసీ ఖర్చు 90 శాతం మేర తగ్గుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications