అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాలకు 'డిజిటల్ ఇంటెలిజెన్స్' చెక్
అవాంఛిత ఫోన్ కాల్స్, సందేశాలతో పాటు టెలికం సోర్సెస్ ఆధారంగా జరిగే ఆర్థిక మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని కట్టడి చేసే అంశంపై టెలికం శాఖ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఇంటెలిజెన్స్ యూనిట్ను, కస్టమర్ ప్రయోజనాల పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది.
కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ నేతృత్వంలో జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అవాంఛిత కాల్స్, అవాంఛిత సందేశాలతో టెల్కో యూజర్లను వేధిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే టెలీ మార్కెటర్లు, ఇతర వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాని అధికారులను ఆదేశించారు.
టెల్కో వనరుల ద్వారా ఆర్థిక మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి వాటి విషయంలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అవాంఛిత కాల్స్, ఆర్థిక మోసాల కట్టడి కోసం డిజిటల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (DIU) ఏర్పాటు కానున్నట్లు వెల్లడించింది.