కంపెనీలకు పీఎఫ్ గుడ్న్యూస్.. రెండేళ్లపాటు ఈపీఎఫ్ను మోడీ ప్రభుత్వమే ఇస్తుంది.. వివరాలివీ...
మూడవ ఆర్థిక ప్యాకేజీ భాగంగా కేంద్ర ప్రభుత్వం గురువారం పలు చర్యలను ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్రం, ఆర్బీఐ కలిపి రూ.29.87 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాయి. భారత జీడీపీలో ఇది 15 శాతం. మరోవైపు ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకుంటున్నాయి. జీఎస్టీ కలెక్షన్లు పెరిగాయి. పీఎంఐ 58.9 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు అంతకుముందు త్రైమాసికం కంటే కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రతికూలంగానే ఉండవచ్చు.
రియల్ ఎస్టేట్కు పన్ను ఊరట: ఇళ్ల ధరలు తగ్గుతాయా? ఇద్దరికీ ప్రయోజనమే..
ఏ రంగానికి ఎంత అంటే..
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా 10 పారిశ్రామిక రంగాలకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలు రూ.1,45,980 కోట్లు, ఎరువుల రాయితీకి అదనపు నిధులు రూ.65,000 కోట్లు, పీఎం ఆవాస్ యోజన అర్భన్కు రూ.18,000 కోట్లు, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, ప్రోత్సాహకాలు రూ.10,200 కోట్లు, గ్రామీణ, ఉపాధి హామీకి అదనపు నిధులు రూ.10,000 కోట్లు, ఎన్ఐఐఎఫ్ డెట్ ప్లాట్ఫాంకు ఈక్విటీ రూ.6,000 కోట్లు, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గారి యోజన రూ.6,000 కోట్లు, ఎగ్జిమ్ బ్యాంకుకు రూ.3,000 కోట్లు, కరోనా వ్యాక్సీన్ అభివృద్ధికి రూ.900 కోట్లు కేటాయించారు.
రెండేళ్ల పాటు కేంద్రమే భరిస్తుంది
ఇందులో భాగంగా యాజమాన్యాలకు, ఉద్యోగులకు రాయితీలు ఇచ్చారు. దీని ప్రకారం కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు ఈపీఎఫ్లో సబ్సిడీ ఇస్తారు. 1,000 మంది వరకు ఉద్యోగులు కలిగిన సంస్థలు, వాటి ఉద్యోగుల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్లో కేంద్రం ఇప్పటికే ఉద్యోగి వాటా 12 శాతం, కంపెనీ వాటా 12 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఈ 24 శాతం రాయితీని కొత్త స్కీం రోజ్గార్ యోజన ద్వారా రెండేళ్లపాటు అందిస్తామని నిర్మలమ్మ తెలిపారు. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉండే సంస్థల్లో కేవలం ఉద్యోగుల వాటాలోనే సబ్సిడీ అందిస్తారు.
ఈపీఎఫ్ఓ ఖాతాను ఆధార్తో అనుసంధానం చేస్తే చాలు
సెప్టెంబర్ నాటికి 50 మంది లోపు ఈపీఎఫ్ రిజిస్టర్డ్ ఉద్యోగులు ఉన్న సంస్థలు అయితే కనీసం ఇద్దరికి, 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు అితే కనీసం 5గురికి కొత్తగా ఉద్యోగాలు కల్పించాలి. కొత్తగా చేరిన ఉద్యోగి ఈపీఎఫ్ఓ ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే చాలునని నిర్మల తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ కాలంలో కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయి, అక్టోబర్ 1వ తేదీన తిరిగి చేరిన వారిని కొత్త ఉద్యోగుల కింద పరిగణించి ప్రయోజనాన్ని వర్తింప చేస్తామని తెలిపారు. ఈ పథకం వచ్చే జూన్ 30 వరకు అమలులో ఉంటుంది.