ఆరోగ్యశ్రీకి అర్హతలు ఇవే: కారు, భూమి, ఇల్లు, ఆదాయం ఎంత ఉండాలంటే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఆరోగ్యశ్రీ మార్గదర్శకాల్ని విడుదల చేసింది. ఈ పథకంలోకి మరింతమందికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కారు, భూమి ఉన్న వారితో పాటు వార్షిక ఆదాయం విషయంలో సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బావిస్తోంది. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు...
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
రూ.5 లక్షల ఆదాయం వరకు ఆరోగ్యశ్రీ
వార్షిక ఆదాయం రూ.5 లక్షలు కలిగి ఉన్న వారికి వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపచేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు లేదా రూ.5 లక్షల వరకు ఉన్నవారు అర్హులు. వారు ఆదాయపు పన్ను పరిధిలో ఉన్నప్పటికీ అర్హులే. ప్రస్తుతం బియ్యం కార్డులు, వైయస్సార్ పింఛన్ కానుక కార్డు, జగనన్న విద్య, వసతి దీవెన కార్డుదారులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేశారు. దీనిని ఇతరులకు కూడా వర్తింప చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులిచ్చారు. ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో 130 ఆసుపత్రులలో ఈ సేవల్ని ఇదివరకే ప్రారంభించారు.
భూమి ఎంత ఉంటే అర్హులంటే?
12 ఎకరాలలోపు మాగాణి, 35 ఎకరాలలోపు మెట్టభూమి, మాగాణి-మెట్ట కలిపి 35 ఎకరాలలోపు ఉన్న వారు ఆరోగ్యశ్రీకి అర్హులు.
ఇంటి స్థలం ఎంత ఎండాలంటే?
3 వేల చదరపు అడుగులు లేదా 334 చదరపు గజాలలో ఇల్లు ఉండి ఆస్తి పన్ను చెల్లించేవారు అర్హులు.
ఈ ఉద్యోగులు అర్హులు
ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, పెన్షన్ తీసుకునేవారు కాకుండా వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న ఒప్పంద, ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్, గౌరవ వేతనం తీసుకునే ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు అర్హులు. వీరు ప్రభుత్వం లేదా ప్రయివేటు కావొచ్చు.
ఒక కారు ఉంటేనే అర్హులు
కుటుంబంలో లేదా ఓ ఇంటికి ఒక కారు ఉన్న వారు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులు. కుటుంబంలో ఒక కారు కంటే ఎక్కువగా ఉంటే మాత్రం పథకానికి అనర్హులు.