కరోనా లాక్డౌన్ పొడిగింపు, బ్యాంకు పనివేళల్లో మార్పులు: ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే
తెలంగాణలో లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో బ్యాంకుల పని వేళల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ను పొడిగించిన నేపథ్యంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీలో బ్యాంకు పని వేళల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఉదయం గం.10 నుండి మధ్యాహ్నం గం.2 వరకు బ్యాంకులు పని చేస్తాయి.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటి వరకు బ్యాంకింగ్ పనివేళలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం సడలింపు సమయాన్ని పొడిగించడంతో బ్యాంకర్ల కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకున్నది.
అత్యవసర సహా ప్రభుత్వం గతంలో అనుమతించిన కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. మారిన బ్యాంకింగ్ పని వేళలు జూన్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి. ఈ మార్గదర్శకాలు జూన్ 9వ తేదీ వరకు అమలులో ఉంటాయి.
హైదరాబాద్లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల పని వేళలు కూడా మారాయి. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవల సమయాన్ని పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 1వ తేదీ నుండి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం గం.1 వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు ఒంటి గంటకు బయలుదేరి 2 గంటల వరకు చివరి స్టేషన్కు చేరుకుంటుంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో మెట్రో సేవల సమయాన్ని పొడిగించారు.