లాయర్లకు జగన్ గుడ్న్యూస్: లా నేస్తం స్కీం, అర్హత, దరఖాస్తు వివరాలు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్తపథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని జూనియర్ న్యాయవాదులకు శుభవార్త అందించింది. వృత్తిలోకి కొత్తగా ప్రవేశించే న్యాయవాదులకు వైయస్సార్ లా నేస్తం పేరుతో నెలకు రూ.5వేల చొప్పున స్టైఫండ్ ఇచ్చేందుకు సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 3వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
AP నిరుద్యోగులకు శుభవార్త: కొత్త ఉద్యోగాలకు టెంత్ పాస్! సచివాలయాలకు కటాఫ్ మార్కుల తగ్గింపు
నెలకు రూ.5వేల చొప్పున స్టైపండ్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ లాయర్లకు మూడేళ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆ ఆర్డర్లో పేర్కొన్నారు. ప్రాక్టీస్లో మూడేళ్ల కంటే తక్కువ అనుభవం కలిగిన లాయర్లకు మొదటి మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఇస్తారు. ప్రస్తుతం బార్ కౌన్సిల్లో నమోదైన న్యాయవాదులు 60వేలకు పైగా ఉన్నారు. ఏటా కొత్తగా 1500 మంది ఎన్రోల్ అవుతున్నారు. ఇలాంటి వారికి ప్రయోజనం చేకూరుతుంది.
స్టైఫండ్కు అర్హతలు
వైయస్సార్ లా నేస్తం కింద స్టైఫండ్ పొందడానికి అర్హతలు ఇవే...
- దరఖాస్తుదారు న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండాలి. ఏపీ న్యాయవాదుల మండలిలో పేరు నమోదు చేసుకొని ఉండాలి.
- జీవో జారీ చేసే నాటికి న్యాయవాదికి 35 ఏళ్ల వయస్సు మించకూడదు.
- 2016లో ఆ తర్వాత న్యాయశాస్త్రంలో ఉత్తీర్ణులైన వారు అర్హులు.
- లాయర్గా పేరు నమోదు చేసుకున్న ఎన్రోల్మెంట్ ధ్రువపత్రాన్ని పరిగణలోకి తీసుకొని మొదటి మూడేళ్లను లెక్కిస్తారు.
- జీవో జారీ చేసే నాటికి జూనియర్ న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించి మూడేళ్లు నిండనివారు మిగిలిన కాలానికి మాత్రమే స్టైఫండ్ పొందుతారు.
- ఒక కుటుంబంలో ఒకరికే ఈ బెనిఫిట్ ఉంటుంది. భర్త, భార్య, పిల్లలు.. ఇలా ఓ కుటుంబంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ ఉంటే ఒకరికే ప్రయోజనం వర్తిస్తుంది.
వీరు అనర్హులు
- నాన్ ప్రాక్టీస్ లాయర్లు
- మూడేళ్ల ప్రాక్టీస్ పూర్తి చేసినవారు
- ఫోర్ వీలర్ కలిగిన వారు
- 35 ఏళ్లు నిండకూడదు
- న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని, న్యాయవాదిగా, ప్రాక్టీస్ చేయకుండా ఇతర ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా అనర్హులు.
దరఖాస్తు ఎలా?
https://ysrlawnestham.ap.gov.in వెబ్ సైట్లోకి వెళ్లి న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు ఆధార్ నెంబర్ జత చేయాలి. స్టైఫండ్ ఏ బ్యాంకు ఖాతాలో కావాలో ఆ అకౌంట్ నెంబర్ వివరాలు ఇవ్వాలి.
- వీటిని గ్రామ/వార్డు వాలంటీర్లకు పంపిస్తారు.
- దరఖాస్తు సరైనదేనని తేలితో దానిని పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు.... జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు.
- కలెక్టర్ల ఆమోదం పొందిన అనంతరం ఆ దరఖాస్తును మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు CFMSలో అప్ లోడ్ చేస్తారు.
- సోషల్ ఆడిట్ కోసం ఆ దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ప్రదర్శిస్తారు.
- అర్హులైన వారి అకౌంట్లలో సొమ్మును జమ చేస్తారు.
- గ్రామ లేదా వార్డు వాలంటీర్లు స్టైఫండ్ చెల్లింపు రసీదును లబ్ధిదారు ఇంటికెళ్లి ఇస్తారు.
ఏం అవసరం...
- దరఖాస్తుదారు తాను ఇంకా ప్రాక్టీస్లోనే ఉన్నానని పదిహేనేళ్ల అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాది లేదా సంబంధిత బార్ అసోసియేషన్ లేదా సంబంధిత కోర్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ల నుంచి అఫిడవిట్ సమర్పించాలి.
- న్యాయవాదిగా నమోదైన తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్ల లోపు సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ను సమర్పించాలి.
ఇలా చేస్తే తెలియజేయాలి..
- దరఖాస్తుదారు న్యాయవాద వృత్తిని విడిచి వెళ్లినా, మరో ఉద్యోగం సంపాదించినా, ఆ విషయాన్ని ఆన్లైన్ ద్వారా రిజిస్టరింగ్ అథారిటీకి తెలియజేయాలి. ఒకే కుటుంబం ఒకే ప్రయోజనం కింద కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్టైఫండ్ను అందుతుంది. ప్రతీ దరఖాస్తుదారు కూడా ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వనం.. ఇతర వివరాలు
- ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం: 30-10-2019 నుంచి 13-11-2019 వరకు
- దరఖాస్తు పరిశీలన: 14-11-2019 నుంచి 20-11-2019 వరకు
- సీఎఫ్ఎంఎస్ లబ్ధిదారుల వివరాలు: 23-11-2019
- కన్సాలిడేటెడ్ బిల్లు సమర్పణ: 25-11-2019
- నగదు జమ (కార్యక్రమం ప్రారంభం): 03-12-2019
- నగదు చెల్లింపు రసీదు డోర్ డెలివరీ: 01-12-2019