అమ్మఒడికి దరఖాస్తు.. అర్హతలు: 75% హాజరు ఉంటేనే, తెల్లరేషన్ కార్డ్ లేకుంటే
అమరావతి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వస్తోంది. ఈ పథకం కింద బడికి వెళ్లే పిల్లల తల్లికి ఆర్థిక సాయం అందిస్తుంది ప్రభుత్వం. ఈ పథకం విధివిధానాల్ని నిర్ణయించడంతో పాటు దీని కోసం రూ.6,450 కోట్ల నిధులను కూడా విడుదల చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
ఆ రూట్లలోనే ప్రైవేటు బస్సులు: ఛార్జీలు, పాస్ల విషయంలో రిలీఫ్
వీరికి అమ్మఒడి వర్తింపు
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు అర్హులు. అర్హులైన పిల్లల తల్లులకు ప్రతి ఏడాది జనవరిలో రూ.15 వేలు అందిస్తారు. తల్లిదండ్రులు లేనిపక్షంలో సంరక్షకులకు ఇస్తారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైయివేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
తెల్ల రేషన్ కార్డు లేకపోయినా...
అమ్మఒడి పథకం కోసం తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. పేదరికంలో ఉండి తెల్లరేషన్ కార్డు లేనివారు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అర్హత ఉందా లేదా అని విచారించి పరిగణలోకి తీసుకుంటారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి కూడా అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.
75 శాతం హాజరు తప్పనిసరి..
అమ్మఒడి పథకం వర్తించాలంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు డిసెంబర్ 31వ తేదీ నాటికి 75 శాతం హాజరు ఉండాలి. ఈ మేరకు ఉన్నతాధికారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల వారీగా ఉపాధ్యాయులు హాజరు నివేదికలను తయారు చేయాలని సూచించారు.
అమ్మ ఒడి దరఖాస్తు ఫారంలో....
అమ్మ ఒడి దరఖాస్తు ఫారంలో ఈ వివరాలు నింపవలసి ఉంటుంది.
- తల్లి పేరు
- తండ్రి పేరు
- కుటుంబ వార్షిక ఆదాయం
- బడికి వెళ్లే పిల్లల సంఖ్య
- మొదటి విద్యార్థి వయస్సు
- చదువుతున్న తరగతి
- పాఠశాల పేరు
- రెండో విద్యార్థి వయస్సు
- చదువుతున్న తరగతి
- పాఠశాల పేరు
- కులం
- గ్రామం
- మండలం
- జిల్లా
జతపరచాల్సినవి... మరిన్ని వివరాలకు...
పై వివరాలు నింపడమే కాకుండా దరఖాస్తు ఫారంతో పాటు తెల్లరేషన్ కార్డు కాపీ, ఆధార్ కాపీ, ఇతర అవసరమైన పత్రాలు ఇవ్వవలసి ఉంటుంది. అమ్మ ఒడి దరఖాస్తు ఫారం అందుబాటులోకి వచ్చింది. అర్హులైన వారు మరిన్ని వివరాల కోసం గ్రామ వాలంటీర్ను సంప్రదించాలి. అర్హత వివరాలు తెలుసుకునేందుకు గ్రామ సచివాలయంలో సంప్రదించవచ్చు.
అమ్మ ఒడి నుంచి వీరికి మినహాయింపు ఉంటుందా?
ఈ పథకం వల్ల దాదాపు 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. వడపోతల ద్వారా ఈ సంఖ్యను కుదించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 2020 జనవరి 26న ఈ స్కీంను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారుల సంఖ్యను కుదించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలలు, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు ఈ స్కీంను వర్తింపచేసే అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి, ఐదెకరాల మాగాణి ఉన్నవారికి, వ్యవసాయ భూమిని నివాస స్థలంగా మార్చుకున్న వారికి కూడా ఈ స్కీం నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారట. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణకు ఇప్పటికే భారీ మొత్తాన్ని ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో వారికి అమ్మఒడి పథకం నుంచి మినహాయింపు ఇవ్వాలని యోచిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై మార్గదర్శకాలు ఖరారు చేస్తోంది.