ఏపీ గ్రామ సచివాలయాలు: మీ ఊళ్లోనే 536 రకాల సేవలు.. 15 ని.ల నుంచి 72 గంటల్లోనే
గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 నుంచి 536 సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15,002 సచివాలయాల్లో ప్రజలు ఈ రోజు నుంచి సేవలను ఉపయోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మారుమూల ప్రాంతాల్లో కూడా వందలాది సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి వస్తున్నాయి.
ఏయే సేవలకు ఎంత సమయం...
ఏయే సేవలను ఎన్ని గంటలు, ఎన్ని రోజుల్లో అందించాలనే అంశంపై సర్వీస్ పట్టికను సిద్ధం చేశారు. అత్యధిక సేవలు 72 గంటల్లోనే అందేలా రూపొందించారు. 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 536 సేవలను ప్రజలకు అందించాలనేది ఈ సచివాలయాల ఉద్దేశ్యం.
15 నిమిషాల్లోను సేవలు
15 నిమిషాల వ్యవధిలో కూడా కొన్ని సేవలు పొందవచ్చు. 1బీ, అడంగల్, ఆధార్, రేషన్ కార్డు ప్రింట్, టైటిల్ డీడ్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సర్టిఫికెట్ కాపీ, విద్యుత్ కనెక్షన్ కేటగిరీ మార్పు వంటివి పావు గంటలో పొందవచ్చు. అప్పటికప్పుడు మొత్తం 47 రకాల సేవలను అందిస్తున్నారు. 148 సేవలు మూడ్రోజుల్లో పరిష్కరిస్తారు. మిగిలిన వాటిని మూడు రోజుల అనంతరం ఒక్కో సేవకు నిర్ణీత వ్యవధి ఉంది. ఈ సేవలకు ప్రత్యేక పోర్టల్ ఉంది.
ఛార్జీలు చెల్లించి పొందే సేవలు కాస్త ఆలస్యం
ఛార్జీలు చెల్లించి పొందే సేవలు అందుబాటులోకి రావడానికి నాలుగైదు రోజులు పట్టవచ్చునని చెబుతున్నారు. ప్రజలు చెల్లించే ఛార్జీలు నేరుగా ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలకు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ఈ సేవలు కొద్ది రోజులు ఆలస్యం అవుతున్నాయి. ఇలాంటివి 70 వరకు ఉన్నాయి. మిగతా 470 సేవలు మాత్రం ఆదివారం అందుబాటులోకి వచ్చినట్లే.
అన్ని సౌకర్యాలతో సిద్ధం..
ప్రతి సచివాలయానికి కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయం, బల్లలు, కుర్చీలు, మొబైల్ అందించారు. ప్రతిచోట కంప్యూటర్, ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. దీంతో ప్రింట్ తీసిన తర్వాత దరఖాస్తుదారులకు లామినేషన్ చేసిన కార్డుల్ని అందిస్తారు. వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఇంటివద్దే అందించేందుకు ప్రభుత్వం నియమించిన 2.81 లక్షల మంది వాలంటీర్లకు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను ఇప్పటికే పంపిణీ చేశారు.
ప్రజల నుంచి విజ్ఞప్తుల కోసం స్పందన
ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు రోజు విధిగా స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మండల పరిషత్, పురపాలక కార్యాలయాల్లో శిక్షణ పొందే ఉద్యోగులు నిర్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సేవలు అందించాలి.