రూ.12,500 సాయం: రైతుభరోసాకు ఎవరు అర్హులు, విధివిధానాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని అక్టోబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా రైతులు, కౌలు రైతులలో ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.12,500 చొప్పున అందిస్తుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ స్కీంలోను రూ.6,000లకు ప్రభుత్వం రూ.6,500 జత చేసి ఇస్తుంది. అంటే ఈ పథకంలో సగం నిధులు కేంద్రం నుంచి వచ్చినవి.
ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, భారత మార్కెట్లపై ప్రభావం
కేంద్రం రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.6,500
పీఎం కిసాన్ స్కీం కింద చిన్న, సన్నకారు రైతులకు మోడీ ప్రభుత్వం నుంచి రూ.6,000 వస్తాయి. వాటికి రూ.6,500 జత చేసి జగన్ ప్రభుత్వం రూ.12,500 ఇవ్వనుంది. ఇక కౌలు, పెద్ద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రూ.12,500 ఇవ్వనుంది.
కౌలు రైతులు కూడా అర్హులే... వాలంటీర్లు గుర్తిస్తారు..
రైతు భరోసా స్కీంకు కౌలు రైతులు అర్హులే. గ్రామ వాలంటీర్ల ద్వారా కౌలు రైతుల గుర్తింపుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రాథమిక సర్వేలో భాగంగా సొంత వ్యవసాయ భూమిలేని సాగుదారులను వాలంటీర్లు గుర్తిస్తారు. కౌలుదారులకు చెందిన ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తారు. నిర్దేశిత ప్రోఫార్మాలో నమోదు చేసి వ్యవసాయ రెవెన్యూ అధికారులకు అందిస్తారు. పరిశీలించిన తర్వాత లబ్ధిదారుల జాబితాను అధికారులు, గ్రామ సభల్లో ప్రకటించి ఏమైనా మార్పులు, చేర్పులు చేస్తారు.
25న జాబితా ప్రకటన
ఈ జాబితాలో మండలస్థాయిలో తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారులు, డివిజన్ స్థాయిలో ఆర్డీవో, ఏడీఏలు పరిశీలిస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది జాబితాను ఖరారు చేస్తారు. ఈ జాబితాను 25వ తేదీన ప్రకటిస్తారు.
రైతు భరోసాకు అర్హులు వీరే...
- వ్యవసాయ/ఉద్యాన/పట్టు పరిశ్రమ సాగుదారులు/కౌలు దారులు రైతు భరోసా పథకానికి అర్హులు.
- ఒక యజమాని/కౌలుదారు ఈ పథకానికి అర్హులు.
- దేవాలయ భూములు అధికారికంగా కౌలుకు తీసుకున్న వారు అర్హులు.
- ఏజెన్సీ ఏరియాలలో ఎస్టీ రైతులు మాత్రమే అర్హులు.
- కౌలుదారులు సాగుచేసే భూములు ఉన్న గ్రామాల్లోనే నివసిస్తున్నట్లు వీఆర్వో ధృవీకరించాలి.
- ఎల్ఈసీ, సీవోసీ లేని సాగుదారులు కూడా అర్హులు
- కౌలు రైతు గానీ/కుటుంబ సభ్యులకు గానీ వ్యవసాయ/ఉద్యాన/పట్టు పరిశ్రమ పంటల సాగు చేసే భూమి ఉండాలి.
- ఒకే కుటుంబంలోని ఇతర సభ్యులకు భూమిని లీజుకు ఇచ్చినట్లయితే ఇది వర్తించదు.
- ఒక భూయజమానికి ఒక కౌలుదారుతో మాత్రమే లీజు అగ్రిమెంట్ కావాలి. (కమతం విస్తీర్ణం ఎంతయినా)
- భూమిలేని కౌలుదారు ఒకటి కంటే ఎక్కువ లీజు అగ్రిమెంట్లు చేసుకున్నా అతనిని ఒక యూనిట్గా మాత్రమే పరిగణిస్తారు.
- భూయజమానులతో పాటు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన ఒక కైలు రైతు మాత్రమే అర్హులు.
రైతు భరోసాకు అర్హులు
- ప్రధానమంత్రి సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందిన రైతులు రైతు భరోసాకు అర్హులే.
- సొంతంగా భూమి ఉంటే 10 సెంట్లు నుంచి 5 ఎకరాలు ఉన్న ప్రతి రైతుకి ఈ స్కీం వర్తిస్తుంది.
- భూయజమాని మరణిస్తే వారి వారసులు, భార్య ఉంటే వారి పేరున ఉన్న భూములు వివరాలను వెబ్ ల్యాండ్లో మార్చుకోవాలి. ఒకే రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రమే స్కీం వర్తిస్తుంది. వ్యవసాయ ఉద్యానవన, పట్టు పరిశ్రమ నడిపే రైతులు, భూమిలేక కౌలుదారుగా సాగుచేస్తున్న రైతులు అర్హులే.
- తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి వారసులు మాత్రమే కౌలుకి చేసినట్లుగా అవుతుంది.
- కౌలు రైతు 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగు చేస్తూ అతని పేరు పైన భూమి లేకుంటే ఈ స్కీం వర్తిస్తుంది.
- భూయజమాని అంగీకారంతో కౌలు రైతులకి ఈ స్కీం వర్తిస్తుంది.
- భూయజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకు ఇస్తే భూ యజమానితో పాటు ఆ కౌలు రైతులలో ఒకరికి మాత్రమే స్కీం వర్తిస్తుంది.
- డీ-పట్టా భూములలో సాగు చేస్తున్న రైతులకు ఈ స్కీం వర్తిస్తుంది.
- ఆన్లైన్లో భూమి నమోదు కాని రైతుకు కూడా ఈ స్కీం వర్తిస్తుంది.
- ఉద్యానవన పంటలు పట్టుపరిశ్రమ చేస్తున్న రైతులకు వర్తిస్తుంది.
- స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో గుమస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ డి ఉన్న రైతులకు ఈ స్కీం వర్తిస్తుంది.
- ఆధార్ నెంబర్లు రిజిస్టర్ నమోదు చేసుకొని ఉండాలి.
అనర్హులు...
- రైతు భరోసాకు అనర్హులు వీరే...
- సంస్థాగత భూకమతాలు కలిగి ఉన్నవారు
- రైతు కుటుంబంలో ఒకరు గానీ అంతకంటే ఎక్కువ సభ్యులు నియోజకవర్గంలో ప్రస్తుత హోదా లేక మాజీ హోదా కలిగి ఉండుట.
- మాజీ/ప్రస్తుత మంత్రి పదవి కలిగి ఉన్న, మాజీ/ప్రస్తుత రాజ్యసభ లేదా లోకసభ లేదా అసెంబ్లీ లేదా కౌన్సెల్ సభ్యులు లేదా మాజీ/ప్రస్తుత పంచాయతీ ప్రెసిడెంట్లు, వివిధ శాఖలలో పనిచేస్తున్న మాజీ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ మంత్రి శాఖలు/ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వయం ప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు. బహుళ పనులు నిర్వహించే, నాలుగో తరగతి సిబ్బంది, గ్రూప్ డీ ఉద్యోగులు మాత్రం అర్హులు.
రైతు భరోసాను వినియోగించుకోవాలి...
రైతు భరోసాలో రైతులు అందరూ వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని, బుధవారం నుంచి గ్రామా గ్రామాన రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అర్హులకు పథకం అందిస్తామన్నారు. దీనిని వినియోగించుకుంటే రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఈ నెల 25వ తేదీ వరకు సర్వే చేస్తామన్నారు. రైతు భరోసా పథకం 70 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనమని చెప్పారు.