ఏపీ రైతులకు గుడ్న్యూస్: రూ.1కే బీమా, స్కీంలో ఇలా చేరండి
అమరావతి: వైసీపీ ప్రభుత్వం ఏపీ రైతులకు రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇవ్వనుంది. ఇందుకు బడ్జెట్లో రూ.8,750 కోట్లు కేటాయించింది. పంటబీమా విషయంలోను రైతులకు జగన్ ఇదివరకే గుడ్ న్యూస్ చెప్పారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకంలో భాగంగా రైతులకు నామమాత్రంగా కేవలం రూపాయి చెల్లిస్తేచాలు, ఆ తర్వాత ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంటే ఆ రూ.1తో పంట ఈ స్కీంలో పేరును నమోదు చేసుకోవాలి.
జగన్! మీరు చేసేది తప్పు, అభివృద్ధి అడ్డుకోకు: కేంద్రమంత్రి
ఉచిత పంట బీమా కోసంసొంతగా సంస్థ
ఇటీవల వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో వైయస్సార్ క్రాప్ ఇన్సురెన్స్ స్కీం కోసం రూ.1,163 కోట్లు కేటాయించారు. ప్రభుత్వమే పంట బీమా చెల్లించడం వల్ల 60.02 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. పంటల బీమా పథకం కోసం ప్రభుత్వం సొంతగా వ్యవసాయ పంటల బీమా సంస్థనే ప్రారంభించనుంది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి పంట బీమా స్కీం అమలు చేయాలని నిర్ణయించారు. ఏపీలో సాగు అయ్యే ప్రతి ఎకరా ప్రీమియం చెల్లించేందుకు నిధులు అందుబాటులో ఉంచనుంది.
రైతులు రూపాయి చెల్లించి నమోదు చేసుకోవచ్చు
బ్యాంకులలో పంట రుణాలు ఉన్న వారితో పాటు, రుణాలుపొందని రైతులు కూడా కేవలం రూపాయి చెల్లించి నమోదు చేసుకోవచ్చు. బ్యాంకుల ద్వారా బీమా ప్రీమియం చెల్లించే వారికి ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేస్తోంది. వాస్తవ సాగు ఎంత ఉంటే అంత బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. రబీ సీజన్ నాటికి మాత్రం ప్రభుత్వమే సొంతంగా వ్యవసాయ బీమా సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
ఇలా నమోదు చేసుకోవాలి
పంట రుణాలు తీసుకోని రైతులు మీ-సేవ కేంద్రాల ద్వారా ఈ స్కీంలో చేరవచ్చు. రూ.1 చెల్లించి పేరును నమోదు చేసుకోవాలి. పేరు నమోదు చేసుకున్న అనంతరం రైతు వాటా ప్రీమియంను వ్యవసాయ శాఖ జమ చేస్తుంది. సాగు చేసే రైతు ఒక రూపాయి చెల్లించి తన పేరును, సాగు చేసిన పంట వివరాలను, పంట పండించిన విస్తీర్ణం, తన భూమి వివరాలను నమోదు చేయాలి.
బ్యాంకు రుణం ద్వారా చెల్లించిన వారికి తిరిగి చెల్లింపు
పంటల కోసం రైతులు ఏప్రిల్, మే నెల నుంచి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. తమకు ఏవైనా పాత రుణాలు ఉంటే వాటికి సంబంధించిన వడ్డీలు చెల్లించి తిరిగి కొత్త రుణంగా మార్చుకున్నారు. ఇలా చెల్లింపులు జరిపిన రైతుల నుంచి బ్యాంకులు పంటకు సంబంధించిన ప్రీమియం ఛార్జీని మినహాయించుకున్నాయి. అయితే, ఇప్పుడు అందరికీ పంట బీమా ప్రీమియం చెల్లింపును ప్రభుత్వమే చేయనున్నందున, రైతుల నుంచి మినహాయించుకున్న మొత్తాలని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనుంది.
పంటబీమా సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రయోజనాలివే...
రాష్ట్ర ప్రభుత్వమే సొంతగా బీమా సంస్థను ఏర్పాటు చేస్తే ఇతర బీమా సంస్థలపై ఆధారపడాల్సిన అవసరముండదు. పరిహారం విడుదల సర్కారు చేతిలో ఉంటుంది. రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఎవరైనా రైతు నష్టపోతే బీమా సంస్థల నుంచి పరిహారం రూపంలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. అది కూడా వారిచుట్టు తిరిగి, బతిమాలి తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ చెల్లింపులు కూడా చాలా ఆలస్యమవుతున్నాయి. ఖరీఫ్, రబీలో సాగయ్యే మొత్తం విస్తీర్ణానికి పంటల బీమా చేయాలంటే రైతు వాటా, ప్రభుత్వం వాటా కలిపి రూ.2,200 కోట్లు అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం వాటా రూ.1,500 కోట్లు కలిపితే రూ.3,500 కోట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం బీమా సంస్థలకు చెల్లిస్తే రైతుకు పరిపూర్ణ న్యాయం జరగడం లేదనే అభిప్రాయం ఉంది. అది వారి చేతికి ఎప్పుడొస్తుందో తెలియదు. ఈ నేపథ్యంలో సొంత బీమా సంస్థ ప్రయోజనం అంటున్నారు. రబీ నుంచి ప్రారంభం కానుంది. ప్రభుత్వం సంస్థను ఏర్పాటు చేస్తే పరిహారం చెల్లింపు అంశం ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది.
పంటల బీమాలో రైతు, రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం వాటాలు..
ఇప్పటి వరకు పంటల బీమా ప్రీమియంలో రైతు వాటా రెండు నుంచి ఐదు శాతంగా ఉంది. మిగతా మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్రం సగం భరిస్తోంది. పంట ప్రీమియం రుసుము ఎక్కువగా ఉండటం, పంట నష్టపోయినా తమకు అమౌంట్ రావడం ఆలస్యం కావడం లేదా అందకపోవడం వంటి కారణాలతో రైతులు ప్రీమియం చెల్లింపుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే చెల్లించనున్నందున ఎక్కువమందికి ప్రయోజనం ఉంటుంది.