అమరావతి: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే మరో కొత్త పథకాన్ని ప్రారంభిస్తోంది. శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో జగన్ మాట్లాడుతూ... అమ్మఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన పలు హామీలు ఇచ్చారు. అందులో అమ్మఒడి ఒకటి.

తల్లి చేతికి రూ.15వేలు
చిన్నారులు అందరూ బడికి వెళ్లాలని, ఉన్నత చదువులు చదవాలని, పిల్లల్ని డాక్టర్లు, ఇంజనీర్లుగా చేసేందుకు తల్లిదండ్రులు అప్పులపాలు కావొద్దని, పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు పడే ఇబ్బందులు చూశానని, అందుకే అమ్మఒడి పథకం ప్రకటించానని జగన్ చెప్పారు. ఇందులో భాగంగా తమ పిల్లల్ని బడికి పంపించే మహిళలకు జనవరి 26వ తేదీన రూ.15 వేలు సాయం అందిస్తామని చెప్పారు. తద్వారా పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. జనవరి 26న ఏపీ వ్యాప్తంగా పండుగదినం నిర్వహించి, తల్లుల చేతికి రూ.15వేలు ఇస్తామన్నారు.

ఇంగ్లీష్ మీడియా, తెలుగు సబ్జెక్ట్
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో చదువురాని వారు సగటున 26 శాతం ఉంటే ఏపీలో 33 శాతం ఉన్నారని జగన్ గుర్తు చేశారు. సెప్టెంబర్ దాటినా విద్యార్థులకు పుస్తకాలు అందని పరిస్థితులు ఉన్నాయన్నారు. స్కూళ్లలో టాయిలెట్స్, ఫర్నీచర్ సరిగా ఉండవని, కార్పోరేట్ స్కూళ్లను ప్రోత్సహించారని విమర్శించారు. రాష్ట్రంలోని 40 వేల పాఠశాలల ఫోటోలు తీయించి, రెండేళ్ల తర్వాత జరిగిన అభివృద్ధిని మళ్లీ ఫోటో తీసి చూపిస్తామన్నారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంతో పాటు తెలుగు సబ్జెక్ట్ను తప్పనిసరి చేస్తామన్నారు.

అమ్మఒడి ఎవరెవరికి?
అమ్మఒడి పథకంపై కన్ఫ్యూజన్ నెలకొంది. దీనిని కేవలం ప్రభుత్వ పాఠశాలలకే ఇస్తారా లేక ప్రయివేటు పాఠశాలలకు కూడా అప్లై చేస్తారా తెలియాల్సి ఉంది. అయితే దీనిని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇవ్వాలని, ప్రయివేటు పాఠశాలలకు ఇస్తే ప్రయివేటీకరణను ప్రోత్సహించినట్లు అవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిని ప్రయివేటు పాఠశాలలకు కూడా వర్తింప చేస్తే ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య మరింత గణనీయంగా తగ్గుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అమ్మఒడి కార్యక్రమాన్ని వీటికి మాత్రమే వర్తింప చేయాలంటున్నారు.

కొన్ని పథకాలు.. లబ్ధి!!
ఇదిలా ఉండగా, గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఏపీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంలో పలు పథకాల, వాటి వల్ల ఏ మేర ప్రయోజనం కలగనుందో ప్రస్తావించారు. యువతకు ఉపాధి శిక్షణ. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో శిక్షణ ఇప్పించడం. ప్రతి ఏటా జనవరిలో ఉద్యోగాల భర్తీ క్యాలెంటర్ ప్రకటన. వైయస్సార్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 ఆర్థిక సాయం. సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహక పెంపు. అమ్మఒడి పథకం ద్వారా మహిళలకు ఏడాదికి రూ.15,000 ఆర్థిక సాయం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు. పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12 వేల నుంచి రూ.18వేలకు పెంపు పూర్తయింది. ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంపు పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి. కాపుల అభివృద్ధికి రూ.10వేల కోట్ల కేటాయింపు. పెన్షనర్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 60కి కుదింపు. ఫీజు రీయింబర్సుమెంట్స్కు అదనంగా విద్యార్థి బోర్డింగ్ వసతి కోసం ఏడాదికి రూ.20వేలు. వైయస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ.75వేలు. గిరిజన సంక్షేమ శాఖలో సామాజిక ఆరోగ్య కార్యకర్తల జీతాలు రూ.400 నుంచి రూ.4వేలు పెంపు పూర్తయింది. అంగన్వాడీ, హోంగార్డుల జీతాలను పెంచుతాం.


Click it and Unblock the Notifications