విప్రో అదరగొట్టింది.. సరికొత్త రికార్డ్, ఏడాదిలో ఎంత లాభపడిందంటే?
దేశీయ ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ షేర్ నేడు అదరగొట్టింది. నేడు ఈ స్టాక్ ఏకంగా 5.41 శాతం లేదా రూ.36.40 లాభపడి రూ709.00 వద్ద క్లోజ్ అయింది. నేడు ఓ సమయంలో భారీగా లాభపడి రూ.739.85 వద్ద ట్రేడ్ అయింది. విప్రోకు 52 వారాల గరిష్టం ఇదే కావడం గమనార్హం. విప్రో 52 వారాల కనిష్టం రూ.331.05. విప్రో స్టాక్ నేడు ఉదయం రూ.697 వద్ద ప్రారంభమై, రూ.739.85 వద్ద గరిష్టాన్ని, రూ.695.00 వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు విప్రో స్టాక్ ఎగిసిపడిన నేపథ్యంలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
ఈ మార్కు అందుకున్న మూడో ఐటీ కంపెనీ విప్రో. విప్రో కంటే ముందు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఈ మార్కెట్ క్యాప్ను అందుకున్నాయి. విప్రో లిమిటెడ్ నిన్న FY22 రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల అనంతరం విప్రో షేర్ దూసుకెళ్తోంది. టీసీఎస్ షేర్ నేడు 1.11 శాతం మేర క్షీణించి రూ.3614.80 వద్ద, ఇన్ఫోసిస్ షేర్ ధర 0.28 శాతం లాభపడి రూ.1714 వద్ద ముగిశాయి. కరోనా మహమ్మారి సమయంలో అదరగొట్టిన రంగాల్లో ఐటీ ముందు ఉన్న విషయం తెలిసిందే. ఐటీ దూకుడు కొనసాగుతోంది.
అందుకే ఆల్ టైమ్ గరిష్టానికి
విప్రో షేర్ నేటి ట్రేడింగ్లో జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. నేటి ట్రేడింగ్లో 10 శాతం వ్యాల్యూ కూడా పెరిగింది. ఐటీ సేవల్లో ఆదాయంలో 8.1 శాతం వృద్ధి నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో ఆశలు పెరిగాయి. దీంతో షేర్ గతంలో ఉన్న రూ.698.95 వ్యాల్యూను దాటేసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను తాకింది. భారత్లో ఈ మార్కును తాకిన మూడో ఐటీ కంపెనీ మాత్రమే కాకుండా, 13వ లిస్టెడ్గా సంస్థ విప్రో నిలిచింది.
కంపెనీ ప్రకటించిన క్వార్టర్ ఫలితాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. జులై-సెప్టెంబర్ కాలంలో విప్రో ఏకీకృత ప్రాతిపదికన రూ.2,930.60 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే క్వార్టర్లో నమోదైన రూ.2,484,40 కోట్ల లాభంతో చూస్తే ఇది 17% అధికం. ఆదాయం కూడా రూ.15,114.50 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.19,667.40 కోట్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన ఆదాయం 10 బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది.
కంపెనీ చేతిలో ఆర్డర్స్
వచ్చే ఆర్థిక సంవత్సరంలో కాలేజీల నుండి 25,000మంది తాజా ఉత్తీర్ణుల్ని నియమించుకుంటామని తెలిపింది. స్థిర కరెన్సీ రూపంలో ఈ విభాగ ఆదాయం ఏడాది క్రితంతో పోలిస్తే 28.8 శాతం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంతో పోలిస్తే 8.1% పెరిగాయి. ఐటీ సేవల నిర్వహణ మార్జిన్లు 17.8 శాతంగా నమోదయ్యాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 1.40 శాతం తగ్గాయి.
డిమాండ్ పరిస్థితులు సానుకూలంగా ఉన్నందున అక్టోబర్-డిసెంబర్లో ఆదాయం 2 శాతం 4 శాతం పెరిగి రూ.19,500- 19,889 కోట్లుగా నమోదు కావొచ్చునని కంపెనీ భావిస్తోంది. విప్రో ఆర్డర్స్ వ్యాల్యూ 27 బిలియన్ డాలర్లుగా నమోదయింది. క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో 8 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్స్ కంపెనీ చేతిలో ఉన్నాయి.
విప్రో రేటింగ్
విప్రో షేర్ ధర ఇటీవల భారీగా ఎగిసిపడింది. ఈ షేర్ ఏడాది కాలంలో 107 శాతం ఎగిసిపడింది. అంటే షేర్ రూ.367 నుండి రూ.709కి పెరిగింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 82 శాతం, ఆరు నెలల కాలంలో 65 శాతం, నెల రోజుల కాలంలో 5 శాతం, ఐదు రోజుల్లో 9 శాతం లాభపడింది. ఈ స్టాక్ పైన వివిధ రేటింగ్ ఏజెన్సీల టార్గెట్ ధరలు ఇలా ఉన్నాయి.
యూబీఎస్ రేటింగ్ న్యూట్రల్ రూ.660.
మకేరీ రేటింగ్ రూ.780.
జేపీ మోర్గాన్ రేటింగ్ రూ.670.