మీ దగ్గర మిగులు సొమ్ము ఉందా? అయితే అప్పులు ఇచ్చేయండి మరి..
ఉద్యోగాలు చేస్తున్న యూత్ చేతిలో భారీగా సొమ్ము ఉంటోంది. తమ లైఫ్ స్టైల్ ఖర్చులు పోగా ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువే ఉంటోంది. ఆసొమ్మును ఏం చేయాలో తెలియని వారు అలాగే తమ ఖాతాలో ఉంచేసుకుంటున్నారు. కొత్త మంది బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే మరి కొంత మంది రికరింగ్ డిపాజిట్ చేస్తున్నారు. కాస్త పరిజ్ఞానం ఉన్న వారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎక్కువ రిస్క్ వద్దనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. క్రమానుగత పెట్టుబడి పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇంకొంత మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా లక్షల కోట్ల దెబ్బ
పెట్టుబడులు..
అయితే ఇప్పుడు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయాయి. స్టాక్ మార్కెట్లు లాభనష్టాలను చవిచూస్తున్నాయి. ఎప్పుడు మన పెట్టుబడులు కరిగిపోతాయో, ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించే అవసరం ఏర్పడుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న సొమ్మును మరొకరికి రుణంగా ఇచ్చే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందుకు కొన్ని స్మార్ట్ సదుపాయాలు అందుబాటులోకి అందులో ఒకటే పీర్ టు పీర్ (పీ 2 పీ) లెండింగ్.
ఆన్లైన్ ద్వారా రుణ వితరణ
స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారు పీర్ టు పీర్ లెండింగ్ ను ఎంచుకోవచ్చు. డిబెంచర్లు, బాండ్ల కన్నా ఇది ఆకర్షణీయమైనదే. దీని ద్వారా కాస్త ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ రిటర్న్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా రుణం అవసరం ఉన్న వారికి లేదా వ్యాపార సంస్థలకు అప్పు ఇవ్వ వచ్చు. ఈ మధ్య కాలంలో పీర్ టు పీర్ లెండింగ్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంపై విశ్వాసం పెరగడంతో భారత రిజర్వ్ బ్యాంక్ పీ2పీ ప్లాట్ ఫామ్స్ పై రుణదాతల రుణ వితరణ పరిమితిని 10 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయలకు పెంచింది. విభిన్న రకాల రుణగ్రహీతలకు రుణాలను ఇవ్వడం ద్వారా మంచి రిటర్న్ లను పొందడానికి అవకాశం ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
రిస్క్ కు తగ్గ రిటర్న్
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 30 పీర్ 2 పీర్ రుణ వితరన ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. వీటిలో 20 సంస్థలు ఆర్బీఐ నుంచి ఎంబీఎఫ్ సి -పీ2పీ లైసెన్స్ ను పొందాయి. మిగతా సంస్థలు కూడా ఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండటం వల్ల కొత్త సంస్థలు పుట్టుకు వస్తున్నాయి.
* ఈ ప్లాట్ ఫార్మ్స్ ద్వారా రుణం ఇవ్వడానికి కనీసం 25,000 అవసరం ఉంటుంది.
* గరిష్టంగా 50 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
* రుణ కాలపరిమితి మూడేళ్లు దాటవద్దని ఆర్జీఐ ఆంక్షలు విధించింది.
* ఒక వ్యక్తికి గరిష్టంగా 50,000 రూపాయల రుణాన్నిమాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
* వార్షికంగా 12 నుంచి 27 శాతం శాతం వరకు రిటర్న్ పొందడానికి అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
* ఈ విభాగంలో రిస్క్ తో పాటు రివార్డ్ కూడా ఉంటుంది కాబట్టి రుణం ఇవ్వాలనుకునే వారు అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలి.