Sovereign gold bond: మార్చి 1 నుండి గోల్డ్ బాండ్స్, ధర ఎంతంటే
సావరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2020-21 సిరీస్ XII మార్చి 1 నుండి మార్చి 5వ తేదీ వరకు ఉంటుంది. మార్చి 9న సెటిల్మెంట్ తేదీ. ఈ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,662గా నిర్ణయించారు. గోల్డ్ బాండ్స్ను 2020-21ను కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్బీఐ జారీ చేస్తోంది. గోల్డ్ బాండ్స్ స్కీం ఇష్యూ ధరను గ్రాముకు రూ.4,662గా నిర్ణయించింది ఆర్బీఐ. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే గ్రాముకు రూ.50 తగ్గింపు ఉంది. అంటే అప్పుడు గ్రాముకు ఇష్యూ ధర రూ.4,612గా ఉంటుంది.
ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జారీ చేసిన గోల్డ్ బాండ్స్ ఇష్యూ ధరను రూ.4,912గా నిర్ణయించింది ఆర్బీఐ. ఇప్పుడు ధరలు పడిపోవడంతో గోల్డ్ బాండ్స్ కూడా తగ్గింది. ఈ బాండ్ పూర్తి కాలం ఎనిమిది సంవత్సరాలు. 5వ సంవత్సరం నుండి నిష్క్రమించవచ్చు. ఈ బాండ్స్ వ్యక్తులు, హెచ్యుఎఫ్, ట్రస్ట్స్, యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలకు అమ్మడానికి పరిమితం చేశారు.
సావరీన్ గోల్డ్ బాండ్స్ను స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మినహా మిగతా బ్యాంకులు జారీ చేస్తాయి. అలాగే స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎంపిక చేయబడిన పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ వంటి గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా విక్రయిస్తారు.