డిజిటల్ పేమెంట్స్లో భారీ ప్రయత్నం: RTGS ఇక 24x7
న్యూఢిల్లీ: రూ.2 లక్షలకు మించి నగదు బదలీ చేసేందుకు ఉపయోగించే RTGS(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) సేవలు నేటి నుండి రోజంతా అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి గం.12.30 నుండి ఇవి అమలులోకి వచ్చాయి. నిన్నటి వరకు ఈ సేవలు అన్ని పని దినాల్లో ఉదయం గం.7 నుండి సాయంత్రం గం.6 వరకు ఉండగా నేటి నుండి 24x7 సేవలు అందుబాటులోకి వచ్చాయి. RTGS వ్యవస్థ నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ అక్టోబర్ నెలలో ప్రకటించింది.
4 నుండి 237 బ్యాంకులకు..
ఆర్టీజీఎస్ సేవలు ఇప్పటి వరకు పరిమితంగా ఉంటూ వచ్చాయని, నెఫ్ట్ తరహాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు రూ.2 లక్షలకు మించి ఆర్టీజీఎస్ కింద నిత్యం ట్రాన్సుఫర్ చేసే అవకాశముంది. ఈ వ్యవస్థ కింద నిధుల బదలాయింపును 24 గంటలు అందుబాటులోకి తెచ్చిన దేశాల జాబితాలో భారత్ చేరింది. 2004 మార్చి 26న ఆర్టీజీఎస్ను ఆర్బీఐ తీసుకు వచ్చింది. మొదట నాలుగు బ్యాంకులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంగా, ఇప్పుడు 237 ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. ప్రస్తుతం రోజు రూ.4.17 లక్షల కోట్ల విలువైన 6.35 లక్షల ఆర్థిక లావాదేవీలు ఆర్టీజీఎస్ ద్వారా నమోదవుతున్నాయి.
అత్యుత్తమ ప్రమాణం..
ఈ ఏడాది నవంబర్ వరకు సగటున 57.96 లక్షల మేర ఆర్టీజీఎస్ టికెట్లు రెయిజ్ అయ్యాయి. ఆర్టీజీఎస్ వ్యవస్థకు ఐఎస్ఓ 20022 సర్టిఫికేషన్ లభించింది. రూ.2 లక్షలు, ఆపైన ట్రాన్సాక్షన్ కోసం ఆర్టీజీఎస్, రూ.2 లక్షల లోపు అయితే నెఫ్ట్ ఉపయోగిస్తారు. ఆర్టీజీఎస్ నిర్వహణ కోసం ఆర్థిక ట్రాన్సాక్షన్స్కు సంబంధించిన మెసేజింగ్లో అత్యుత్తమ ప్రమాణాన్ని వినియోగిస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధించవద్దని ఆర్బీఐ నిర్ణయించింది. అయితే బ్యాంకులు... ఆర్టీజీఎస్, నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ పైన కనీస ఛార్జీని వసూలు చేస్తున్నాయి. ఆర్టీజీఎస్ సేవల్ని ఆన్లైన్తో పాటు మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. బ్రాంచీని సందర్శించడం ద్వారా ఆఫ్లైన్లో సేవలు పొందవచ్చు.
ఇదీ ఆర్టీజీఎస్... ప్రయాణం
2000 సంవత్సరానికి ముందు చెల్లింపు విధానం పేపర్ ఆధారిత, చెక్కు ఆధారమే ప్రధానం. ఇంటర్-బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం కూడా ఒక బ్యాంకు ప్రతినిధి మరో బ్యాంకుకు వెళ్లేవారు. 2000 సంవత్సరం ప్రారంభం నుండి ట్రాన్సాక్షన్స్లో మార్పు ప్రారంభమైంది. ఇన్పర్మేషన్ టెక్నాలజీ చట్టం ఆమోదంతో ఎలక్ట్రానిక్ డేటా ట్రాన్సాక్షన్స్కు ఆచరణీయమైన రుజువుగా మారింది. 2002 నాటికి రెగ్యులేటర్ ఆర్బీఐ యూకేకు చెందిన లోజికాతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఆర్టీజీఎస్ ప్రేమ్ వర్క్ను సిద్ధం చేసేందుకు టీసీఎస్తో కలిశారు.
ఆర్టీజీఎస్ను 2004లో ప్రారంభించారు. 2010లో ఆర్టీజీఎస్ ఉపయోగాన్నిపెంచేందుకు హేతుబద్దీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 2013 అక్టోబర్లో పునరుద్ధరించారు. 2019 డిసెంబర్ నెలలో ఆర్టీజీఎస్ సేవలపై ఆర్బీఐ ఛార్జీలను రద్దు చేసింది. డిసెంబర్ 2020 నుండి ఆర్టీజీఎస్ 24X7 అందుబాటులోకి వచ్చింది.