ఐటీ రీఫండ్ రాలేదా... వీరి పట్ల జాగ్రత్త: ఎస్బీఐ, ఈపీఎఫ్ఓ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఇన్కం ట్యాక్స్ రీఫండ్ కోసం రిక్వెస్ట్ పెట్టమంటూ మీ మొబైల్ ఫోన్కు వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వరంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) పేర్కొంది. ఈ మేరకు SBI ట్వీట్ చేసింది. అలాంటి సందేశాలు ఏవైనా వచ్చినప్పుడు వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలని, సైబర్ అధికారులకు ఫిర్యాదు చేయాలని హెచ్చరించింది.
అది ఫేక్ అలర్ట్
'ఇన్కం ట్యాక్స్ రీఫండ్ కోసం రిక్వెస్ట్ పంపించాలని ఐటీ శాఖ నుంచి సందేశం వచ్చిందా?... అయితే ఆ సందేశాలు అన్నీ కూడా నకిలీవి. సైబర్ నేరగాళ్లు ఈ కొత్త పంథాను ఎంచుకున్నారు. అలాంటి సందేశాలు వస్తే కనుక ఆ లింక్స్ పైన క్లిక్ చేయవద్దు. వాటిని క్లిక్ చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయండి' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాదు, ప్రజల అవగాహన కోసం వీడియోను పోస్ట్ చేసింది.
ఎవరితోను పంచుకోకండి
అలాండి నకిలీ సందేశాల ద్వారా వచ్చిన లింక్ను క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్లు మీ ఐడీ, పాస్ వర్డ్ వంటి వ్యక్తిగత వివరాలు అడుగుతారు. వాటి సాయంతో మీ అకౌంట్లలోని డబ్బులను ఖాళీ చేస్తారని ఎస్బీఐ హెచ్చరించింది. ఎలాంటి అనుమానాస్పద లింక్స్ను క్లిక్ చేయవద్దని, మీ బ్యాంకు అకౌంట్ వివరాలు ఎవరితోను పంచుకోవద్దని తెలిపింది.
సందేశాల పట్ల జాగ్రత్త
ఐటీ రిటర్న్ ఫండ్ కోసం వెబ్ సైట్కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అంతేకానీ ఐటీ శాఖ నుంచి మీ బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు అడుగుతూ సందేశాలు రావు. ఫోన్లు చేయరు. అలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అలర్ట్..
మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్ నెంబర్స్, OTPల గురించి తాము ఎప్పుడూ అడగమని, మీరు కూడా ఎవరితో పంచుకోవద్దని ఈపీఎఫ్ఓతో పదే పదే చెబుతుంది. అలాగే, బ్యాంకులు, ఆన్ లైన్ చెల్లింపు సంస్థలు కూడా తమ కస్టమర్లు మోసపోకుండా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తాయి.
మీ ఆధార్ లేదా పాన్ లేదా యూఏఎన్ లేదా బ్యాంకు అకౌంట్ వంటి వివరాలు ఈపీఎఫ్ఓ ఎప్పుడూ అగడదని, ఫలానా అకౌంట్లలో డబ్బులు వేయమని కూడా కోరదని, అటువంటి నకిలీ ఫోన్ కాల్స్కు స్పందించవద్దని ఈపీఎఫ్ఓ తమ వెబ్సైట్లో సూచించింది. వెబ్సైట్స్, టెలీకాల్స్, ఎస్సెమ్మెస్, సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఆఫర్లు వస్తే తిరస్కరించాలని సూచిస్తోంది.