RBI new rules: కార్డు ట్రాన్సాక్షన్స్పై జనవరి 1 నుండి కొత్త రూల్స్, ఆ ఛార్జీల్లేవు
ఆన్లైన్ కార్డు ట్రాన్సాక్షన్స్కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి 1వ తేదీ నుండి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో వంటి కంపెనీలు వచ్చే నెల ప్రారంభం నుండి తమ వేదికల పైన కస్టమర్ల కార్డు సమాచారాన్ని సేవ్ చేసుకోలేవు. ఇందుకు ఆర్బీఐ కొత్త ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ నిబంధనలు అమల్లోకి రావడమే కారణం. కస్టమర్ల భద్రత లక్ష్యంగా 2020 మార్చి నెలలో కస్టమర్లు కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ కేంద్ర బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కార్డు టోకెనైజేషన్ సర్వీసుపై మార్గదర్శకాలను విడుదల చేసింది. కస్టమర్ల సమ్మతితో కార్డు డేటా టోకెనైజేషన్ విజయవంతమవుతుందని పేర్కొంది.
ఇలా నివారించుకోవచ్చు
అంటే ఈ కొత్త సంవత్సరం ప్రారంభం నుండి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే కస్టమర్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను ప్రతిసారి నమోదు చేయవలసి ఉంటుంది. అయితే, కస్టమర్లు ఈ ఇబ్బందులను నివారించుకోవచ్చు. వారి కార్డులను టోకనైజ్ చేయడానికి ఈ-కామర్స్ లేదా ఫుడ్ డెలివరీ యాప్స్ ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్కు అనుమతించే సౌకర్యం ఉంది. దీనిని ఎంచుకోవడం ద్వారా ప్రతిసారి నమోదు చేసే అంశాన్ని నివారించుకోవచ్చు. 'కార్డు టోకెనైజేషన్ సేవలు కస్టమర్ సమ్మతితో నిర్వహించుకోవచ్చు'నని ఆర్బీఐ పేర్కొంది.
యూనిక్ ఆల్గారిథమ్ జనరేటెడ్ కోడ్తో కార్డు వివరాలను రీప్లేస్ చేసుకోవడానికి టోకెనైజేషన్ సహకరిస్తుంది. ఈ మార్గదర్శకాలు వచ్చే ఏడాది నుండి వర్తిస్తాయి. దీంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పైన కొత్త రూల్స్ వస్తున్నాయి.
కొత్త రూల్స్ ప్రకారం...
- 2022 జనవరి 1వ తేదీ నుండి ఏ ఈ-కామర్స్ ప్లాట్ఫాం పైన అయినా కస్టమర్లు తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు వివరాలను సేవ్ చేసుకోలేరు.
- ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే ప్రతిసారి కార్డుహోల్డర్ కార్డు వివరాలను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
- ప్రతిసారి కార్డు నెంబర్ ఎంటర్ చేయడం ఇబ్బంది అని భావిస్తే.. టోకెనైజేషన్ చేయవచ్చు. ఇందుకు సంస్థలకు కస్టమర్లు అంగీకారం తెలపాలి. అప్పుడు కానీ అదనపు ఫ్యాక్టర్ అథెంటికేషన్తో కస్టమర్లు కార్డు వివరాలను సదరు కార్డు నెట్ వర్క్ సంస్థను అడిగి ఈ కామర్స్ సంస్థలు తీసుకుంటాయి.
- ఈ-కామర్స్ సంస్థలు వివరాలను తీసుకుంటే ఆపై కస్టమర్లు తమ తదుపరి ట్రాన్సాక్షన్స్ కోసం సదరు కార్డు వివరాలను ఈ-కామర్స్ వేదికపై సేవ్ చేసుకోవచ్చు.
- ప్రస్తుతం మాస్టర్ కార్డ్స్, వీసా కార్డులు మాత్రమే టోకెనైజేషన్కు అనుమతిస్తున్నాయి. ఆర్బీఐ కొత్త నిబంధనల తర్వాత మరిన్ని కార్డు సంస్థలు టోకెనైజేషన్ అంగీకరించవచ్చు.
అదనపు ఛార్జీల్లేవు
- క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ రెండింటికి ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు తప్పనిసరి.
- అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్కు కొత్త మార్గదర్శకాలు వర్తించవు. దేశీయ కార్డ్స్, ట్రాన్సాక్షన్స్కు మాత్రమే కొత్త మార్గదర్శకాలు వర్తిస్తాయి.
- కార్డు టోకెనైజేషన్ కోసం కస్టమర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు.
- ఈ-కామర్స్ సంస్థలు టోకెనైజేషన్ చేయబడిన కార్డ్స్ చివరి నాలుగు అంకెలు కస్టమర్లు సులభంగా గుర్తించేందుకు వాటిని జారీ చేసే బ్యాంకు, కార్డు నెట్ వర్క్ పేరుతో చూపుతాయి.
- కార్డు టోకెనైజేషన్ కస్టమర్లకు తప్పనిసరి కాదు. ట్రాన్సాక్షన్ వేగంగా జరగడానికి మాత్రమే అవసరమని గుర్తుంచుకోవాలి. టోకెనైజేషన్ వద్దనుకుంటే ప్రతిసారి కార్డు వివరాలను కస్టమర్లు ఎంటర్ చేసుకోవచ్చు.