ఇన్వెస్టర్లకు 'రైల్వే' షాక్, అంతలోనే వెనక్కి: పడిలేచిన IRCTC స్టాక్స్
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) షేర్లు శుక్రవారం ఉదయం భారీ స్థాయిలో పతనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం కారణం. అయితే ఈ నిర్ణయాన్ని ఆ తర్వాత వెనక్కి తీసుకోవడంతో స్టాక్స్ మళ్లీ పుంజుకున్నాయి. IRCTC షేర్ 52 వారాల గరిష్ట ధర రూ.983. 52 వారాల కనిష్ట ధర రూ.51.60. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.42 లక్షల కోట్లుగా ఉంది. నేడు ఈ స్టాక్ రూ.822 వద్ద ప్రారంభమై, రూ.906 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.639 వద్ద కనిష్టానికి పడిపోయింది. ప్రభుత్వం నిర్ణయంతో స్టాక్ రూ.640 దిగువకు పడిపోయింది. కానీ నిర్ణయం ఉపసంహరణతో మళ్లీ పుంజుకొని రూ.850ని దాటింది.
అసలేం జరిగింది?
రైల్వేలో క్యాటరింగ్, టికెట్ బుకింగ్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ వంటి సేవల్ని IRCTC అందిస్తోంది. ఈ రంగంలో IRCTCదే గుత్తాధిపత్యం. టికెట్ బుకింగ్లో 73 శాతం, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్లో 45 శాతం వాటా ఈ సంస్థకు ఉంది. ఈ సంస్థలో ప్రభుత్వానికి వాటాలు ఉన్నాయి. టికెట్ బుకింగ్ ద్వారా వస్తోన్న కన్వీనియెన్స్ ఛార్జీ ఆదాయంలో 50 శాతం తమకు ఇవ్వాలని గురువారం IRCTCకి రైల్వేశాఖ లేఖ రాసింది.
ఈ నిర్ణయంతో IRCTC స్టాక్స్ భారీగా నష్టపోయాయి. అయితే వ్యాపార వర్గాలు, మార్కెట్ నిపుణులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ వెనక్కి తగ్గింది. నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో షేర్లు మళ్లీ లాభపడ్డాయి.
పడిలేచిన స్టాక్
తొలుత రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయంతో రెగ్యులేటరీ రిస్క్ మధ్య డీరేట్ అవుతుందనే ఆందోళనతో IRCTC స్టాక్ 29 శాతం మేర పతనమైంది. ఆ తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పరుగులు పెట్టింది. అయితే నిన్నటితో పోలిస్తే తక్కువగానే ఉంది. నిన్న IRCTC షేర్ రూ.913 వద్ద ముగిసింది. నేడు రైల్వే శాఖ తొలి నిర్ణయంతో స్టాక్ రూ.639.45కి పడిపోయింది. అక్టోబర్ 19 నాటి గరిష్టంతో పోలిస్తే 49 శాతం క్షీణత. కానీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోడంతో మధ్యాహ్నం పుంజుకుంది. మధ్యాహ్నం గం.2.20 సమయానికి ఈ స్టాక్ రూ.831.60 వద్ద ట్రేడ్ అయింది.
దిద్దుబాటు
కరోనాకి ముందు కన్వీనియెన్స్ ఫీజు ద్వారా IRCTCకి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.349 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా విజృంభించిన 2020-21లోనూ రూ.299 కోట్ల ఆదాయం వచ్చింది. కరోనా నేపథ్యంలో క్యాటరింగ్ సహా ఇతర సేవల నుండి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోయింది. దీంతో 2020-21లో కన్వీనియెన్స్ ద్వారా వచ్చిన ఆదాయమే అత్యధికం. దీంతో ప్రస్తుతం IRCTC ప్రధాన ఆదాయ వనరు నుండి ప్రభుత్వం వాటా అడగడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా కలవరానికి గురయ్యారు.
అమ్మకాలకు దిగారు. దీంతో షేర్లు పడిపోయాయి. ఇన్వెస్టర్లకు లాభాలు తెస్తోన్న కంపెనీలో ప్రభుత్వం జోక్యం సరికాదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. కంపెనీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. దీంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీపమ్ కార్యదర్శి కూడా ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 239 శాతం రిటర్న్స్ ఇచ్చింది.