Paytm: కోలుకున్న పేటీఎం షేర్, ఐనా వారికి లాభం... వీరు ఇంకా నష్టాల్లోనే..
వరుసగా రెండు సెషన్లలో భారీగా నష్టపోయిన పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ నేడు (మంగళవారం, నవంబర్ 23) కోలుకుంది. ఈ రోజు ఉదయం నుండి లాభాల్లోనే ట్రేడ్ అవుతుంది. నిన్న రూ.1359.60 వద్ద క్లోజ్ అయిన ఈ స్టాక్ నేడు దాదాపు అక్కడే (రూ.1360 వద్ద) ట్రేడింగ్ను ప్రారంభించింది. రూ.1492 వద్ద నేడు గరిష్టాన్ని తాకి, రూ.1360 వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12.30 సమయానికి 8.50 శాతం మేర లాభపడి రూ.1475 వద్ద ట్రేడ్ అవుతోంది.
నిన్న రూ.90 వేల కోట్ల దిగువకు చేరుకున్న మార్కెట్ క్యాప్, నేడు రూ.95వేల కోట్లు క్రాస్ చేసింది. ఈ షేర్ గరిష్టం లిస్టింగ్ సమయంలోని రూ.1955. కనిష్టం అదే రోజు రూ.1271. పేటీఎం షేర్ ఇష్యూ ధర రూ.2150. లిస్టింగ్ రోజు నుండి కేవలం రెండు రోజుల్లోనే ఓ సమయంలో రూ.1300 దిగువకు పడిపోయిన ఈ స్టాక్ మూడో రోజైన మంగళవారం మాత్రం సానుకూలంగా కదలాడుతోంది.
వారికి లాభం... వీరు ఇంకా నష్టాల్లోనే..
ఐపీవోలో పాల్గొని, పేటీఎం లాట్ను దక్కించుకున్న వారికి ఒక్కో షేర్ రూ.2150 పడింది. కానీ ఈ షేర్ లిస్టింగే రూ.1950 వద్ద ప్రారంభమై, నిన్నటి వరకు రెండు సెషన్లలో 36 శాతం నష్టపోయింది. భారత బిగ్గెస్ట్ లిస్టింగ్ ప్లాప్గా నిలిచింది. ఐపీవో సమయంలో పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.50 లక్షల కోట్లు కాగా, నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రూ.88,184.67 కోట్లకు క్షీణించింది.
కానీ నేడు ఎనిమిది శాతానికి పైగా లాభపడి కాస్త ఊరట కలిగించింది. మార్కెట్ క్యాప్ కూడా రూ.95 వేల కోట్లకు చేరుకుంది. ఐపీవోలో లాట్ దక్కించుకున్న వారు ఇప్పటికీ ఒక్కో షేర్ పైన రూ.650 తక్కువ ఉంది. అయితే గత రెండు సెషన్లలో పేటీఎం షేర్ను కొనుగోలు చేసిన వారు మాత్రం లాభపడినట్లే. భారీ క్షీణత రూ.1271 వద్ద కొనుగోలు చేసిన వారు ఇప్పుడు ఒక్కో షేర్ పైన రూ.200 ఆర్జించినట్లే.
పేటీఎం స్టాక్ కొనుగోలుపై...
ఈ కంపెనీ షేర్ మున్ముందు మరింత తగ్గి రూ.1200 స్థాయికి చేరుకోవచ్చునని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ మాక్వెరీ రీసెర్చ్ ఇటీవల పేర్కొంది. అంటే ఐపీవో ఇష్యూ ధర రూ.2150తో పోలిస్తే 44.2 శాతం క్షీణత. పేటీఎం ప్రైస్ టు సేల్స్ వ్యాల్యూయేషన్ ఖరీదైనదని, లాభదాయకత చాలా కాలం వరకు అస్పష్టంగానే ఉంటుందని ఈ బ్రోకరేజీ సంస్థ తన నోట్లో తెలిపింది.
అక్టోబర్ నెలలో గ్రాస్ మర్చంటైజ్ ఏడాది ప్రాతిపదికన 131 శాతం పెరిగిందని, అయినప్పటికీ మాక్వెరీ లాభనష్టాల అంచనాలను ప్రభావితం చేయలేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. పేటీఎం ఐపీవో పరిమాణం డిమాండ్ను పరిమితం చేసిందని పేర్కొంటున్నారు. ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో, బ్యూటీ స్టార్టప్ నైకా ఐపీవోలు పేటీఎం కంటే చిన్నవి. కానీ ఈ స్టాక్స్ ఐపీవోతో పోలిస్తే లాభపడ్డాయి.
పేటీఎం వ్యాపార వ్యాల్యూ డబుల్
ఇదిలా ఉండగా, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం స్థూల మర్చైండైజ్ వ్యాల్యూ(GMV) జులై-సెప్టెంబర్లో రెట్టింపు అయి రూ.1,95,600 కోట్లకు చేరుకుంది. బీఎస్ఈకి ఇచ్చిన తొలి కార్యకలాపాల పనితీరు నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది సంస్థ. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ EMV రూ.94,700 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో వినియోగదారుల సంఖ్య 4.3 కోట్ల నుండి 33 శాతం పెరిగి 5.7 కోట్లకు చేరుకుంది.
రుణాల సంఖ్య 3.49 లక్షల నుండి 28.41 లక్షలకు చేరగా, రుణమొత్తం 500 శాతం వృద్ధితో రూ.1260 కోట్లకు చేరుకుంది. పేటీఎం యాప్ ద్వారా వ్యాపార సంస్థలకు జరిగిన మొత్తం చెల్లింపులను GMVగా పరిగణిస్తారు. వినియోగదారు నుండి వినియోగదారు(C2C)కు జరిగే నగదు చెల్లింపులను ఇందులో కలపరు. అక్టోబర్ నెలలో కంపెనీ GMV రూ.36,000 కోట్ల నుండి 131 శాతం పెరిగి రూ.83,200 కోట్లకు చేరుకుంది. రుణమొత్తం 418 శాతం పెరిగి రూ.630 కోట్లకు చేరుకుంది.