ఐటీ రిటర్న్స్లో నిర్మలమ్మ ఊరట కల్పించారా, ఐనా జాగ్రత్త లేదంటే 50% వరకు పెనాల్టీ!
కేంద్ర బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి వేతనజీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుండి ఎలాంటి ఊరట ప్రకటనలు రాలేదు. అయితే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతా లేదా మరేదైనా ఆదాయాన్ని వెల్లడించడం మరిచిపోతే రిటర్న్స్ను సరిచేసుకునే వెసులుబాటును మాత్రం కల్పించారు. ఇది అప్డేటెడ్ ట్యాక్స్ రిటర్న్. ఈ విధానం ప్రకారం పన్ను చెల్లింపుదారుడు ఆదాయపు పన్ను దాఖలు సమయంలో ఏదైనా ఆదాయాన్ని వెల్లడించడం మరిచిపోతే లేదా తప్పుగా నమోదు చేస్తే సంబంధిత అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన రెండేళ్లలోపు సవరించుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు సెక్షన్ 139లో సబ్ సెక్షన్ 8ఏను చేర్చాలని ప్రతిపాదించారు.
ఐటీఆర్ సవరణ
ఆదాయపు పన్ను సెక్షన్ 139 ప్రకారం పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం జూలై 31వ తేదీలోపు అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ఫైల్ చేస్తారు. ప్రభుత్వం ఏదైనా కారణంతో గడువు పెంచితే ఆ లోపు అయినా దాఖలు చేయాలి. గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలి. గడువులోగా ఫైల్ చేయకుంటే సెక్షన్ 139లోని సబ్ సెక్షన్ 4 కింద దాఖలు చేసిన ఐటీఆర్లో ఏదైనా తప్పులు ఉంటే సవరించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సవరణలు అసెస్మెంట్ ఏడాది ముగియడానికి మూడు నెలల ముందు లేదా అసెస్మెంట్ ముగింపు.. వీటిలో ఏది ముందు అయితే ఆ లోగా పూర్తి చేయాలి.
రెండేళ్లపాటు వెసులుపాటు
గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్లో ఏదైనా ఆదాయం వెల్లడించకపోతే లేదా తప్పులు దొర్లితే అప్ డేటెడ్ పన్ను రిటర్న్స్ను ఫైల్ చేయడానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ప్రస్తుతం నిర్మలమ్మ ఈ వెసులుబాటు కల్పించడం పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట. ఇక నుండి రెండేళ్ళ వరకు ఈ వెసులుబాటు కల్పించారు.
అయినప్పటికీ పెనాల్టీ
రెండేళ్ల వరకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ చెల్లింపుకు సంబంధించి బాధ్యతగా ఉండాల్సిందే. మీరు ఆదాయం తెలపడం మరిచిపోయి, ఆ ఆదాయంపై పన్ను చెల్లించవలసి వస్తే మీరు చెల్లించే మొత్తం పైన 25 శాతం నుండి 50 శాతం వరకు అదనపు పన్ను చెల్లించాలి. కాబట్టి రిటర్న్స్ సమయంలోనే పొరపాటు దొర్లకుండా చూసుకోవాలి.