New NPS rule: 65 ఏళ్ళ తర్వాత చేరవచ్చు, 50% నిధులు ఈక్విటీలకు మళ్లించవచ్చు
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(PFRDA) నేషనల్ పెన్షన్ సిస్టం(NPS) సబ్స్క్రిప్షన్ వయస్సును పెంచింది. అదే సమయంలో నిష్క్రమణ నియమాలను కూడా సడలించింది. 65 ఏళ్ల వయస్సు కలిగిన సబ్స్క్రైబర్స్ 50 శాతం నిధులను ఈక్విటీలకు మళ్లించేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా NPSలో చేరేందుకు ఇప్పటి వరకు వయస్సు 18 నుండి 65 సంవత్సరాలు ఉండాలి. ప్రస్తుతం దీనిని 70 సంవత్సరాలకు పొడిగించారు. 60 సంవత్సరాలు దాటినవారు, సూపర్యాన్యుటేషన్ తీసుకున్నవారు పెట్టుబడులు పెట్టేందుకు, అలాగే 65 సంవత్సరాల దాటిన సీనియర్ సిటిజన్స్ NPSలో అకౌంట్ తెరిచేందుకు వెసులుబాటు కల్పించారు. తద్వారా సబ్స్క్రిప్షన్ వయస్సును 70కి పొడిగించారు. ప్రస్తుత సబ్స్క్రైబర్ల నుండి పెద్ద సంఖ్యలో వస్తోన్న అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు PFRDA సర్కులర్లో తెలిపింది.
ఎప్పుడు చేరవచ్చు?
ఇంతకుముందు 65 ఏళ్ల లోపు వయస్సు వారు NPSలో చేరవచ్చు. తాజాగా సడలించిన నిబంధనల ప్రకారం 70 ఏళ్ల వరకు చేరవచ్చు. అంటే 18 నుండి 65 ఏళ్లకు బదులు 18 నుండి 70 ఏళ్ల మధ్య ఎప్పుడైనా NPSలో చేరవచ్చు.
ఇండియన్ సిటిజన్, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(OCI)లు ఇప్పటి వరకు 65 నుండి 70 ఏళ్లలోపు NPSలో చేరడానికి అర్హులు కాగా, ఇక నుండి 75 ఏళ్ల వరకు చేరవచ్చు.
వయస్సు నిబంధనల సడలింపు నేపథ్యంలో NPSలో సబ్స్కైబర్లను క్లోజ్ చేసిన వారు కూడా తిరిగి చేరవచ్చు.
65 సంవత్సరాలు దాటిన వారు తమ నిధుల్లో పదిహేను శాతం మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్లోకి మళ్లించుకోవచ్చు. ఇది ఆటో ఛాయిస్. యాక్టివ్ ఛాయిస్ కింద గరిష్టంగా 50 శాతం నిధులు ఈక్విటీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు.
పీఎఫ్ను సంవత్సరానికి ఒకసారి, పెట్టుబడుల కేటాయింపును సంవత్సరానికి రెండుసార్లు మార్చుకోవచ్చు.
బయటకు రావొచ్చు కానీ..
సాధారణంగా మూడేళ్ల తర్వాత ఈ స్కీం నుండి బయటకు వెళ్లవచ్చు. అయితే 40 శాతం కార్పస్ను యాన్యూటి కొనుగోలుకు వినియోగించాలి. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ మొత్తం కార్పస్ రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ ఉంటే సబ్స్క్రైబర్ సేకరించిన పెన్షన్ నిధి మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు.
మూడేళ్లకు ముందే నిష్క్రమిస్తే మెచ్యూరిటీకి ముందే వెళ్లినట్లుగా పరిగణిస్తారు. సబ్స్క్రైబర్ 80 శాతం కార్పస్ యాన్యుటిలలో పెట్టుబడులు పెట్టవలసి ఉంటుంది. మిగిలిన 20 శాతం మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోవచ్చు. ఒకవేళ మొత్తం కార్పస్ రూ.2.5 లక్షలు, అంతకంటే తక్కువ ఉంటే, సబ్స్క్రైబర్ సేకరించిన పెన్షన్ నిధి మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. సబ్స్క్రైబర్ మృతి చెందితే నామినీకి చెల్లిస్తారు.
నిబంధనలు...
- 65 ఏళ్ల వయస్సులో NPSలో చేరితో మూడేళ్ల తర్వాత మాత్రమే బయటకు రావొచ్చు.
- 60 శాతం కార్పస్ వెనక్కి, మిగతా 40 శాతం యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి.
- కార్పస్లో జమ అయిన మొత్తం రూ.5 లక్షల లోపు ఉంటే ఉపసంహరించుకోవచ్చు.
- 65 ఏళ్ల వయస్సులో చేరి మూడేళ్లలోపు బయటకు వస్తే 20 శాతం కార్పస్ మాత్రమే వెనక్కి ఇస్తారు. 80 శాతం కార్పస్ను యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాలి.
- రూ.2.5 లక్షల లోపు ఉంట్ మాత్రం చేరిన మూడేళ్లలోపు తప్పుకుంటే మొత్తం వెనక్కి తీసుకోవచ్చు.