మీ బంగారు నగల హాల్మార్క్ నిజమైనదా, ఎలా తెలుసుకోవచ్చు?
దేశంలోని 256 జిల్లాల్లో బుధవారం నుండి బంగారం నగలపై హాల్ మార్కింగ్ నిబంధనలు అమలులోకి వచ్చాయి. తొలి దశలో భాగంగా ఈ జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. వినియోగదారుల మెరుగైన రక్షణ, సంతృప్తి కోసం తమ ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగుతాయని, ఇందులో భాగంగా జూన్ 16వ తేదీ నుండి పై ప్రాంతాల్లో హాల్ మార్కింగ్ను అమలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. హాల్ మార్కింగ్కు సంబంధించి ప్రస్తుతానికి ఆగస్ట్ 2021 వరకు ఎలాంటి జరిమానా విధించబడదని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో హాల్ మార్కింగ్
ఆంధ్రప్రదేశ్లో 12 జిల్లాల్లో, తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో హాల్ మార్కింగ్ను అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మినహా మిగతా జిల్లాల్లో, తెలంగాణలో మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో హాల్ మార్కింగ్ అమలులోకి వచ్చినట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS) తెలిపింది. మీరు కొనుగోలు చేయబోయే బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ తప్పనిసరి. హాల్ మార్క్ అసలైనదా కాదా అని పరిశీలించడం ముఖ్యం.
BIS గుర్తు ఉందో లేదో...
హాల్మార్క్ గుర్తులో మూడు అంశాలు ఉంటాయి. త్రిభుజాకారంలో ఉన్న BIS గుర్తు ఉందో లేదో చూసుకోవాలి. స్వచ్చతను సూచించే క్యారెటేజ్ చూసుకోవాలి. దీంతో అసెయింగ్ హాల్ మార్కింగ్ కేంద్రం గుర్తు ఉందా లేదా తెలుసుకోవాలి. BIS లైసెన్స్ చూపించాలని దుకాణదారుడిని అడగవచ్చు. BIS మార్గదర్శకాల ప్రకారం ఆభరణాల లైసెన్స్ను కొనుగోలుదారులకు చూపించాల్సి ఉంటుంది. అందులోని అడ్రస్లోనే షాప్ ఉందో లేదో చూసుకోవాలి.
చార్జీలు..
బిల్లు తీసుకునేటప్పుడు హాల్ మార్కింగ్ ఛార్జీలను కూడా పేర్కొనమని అడగవచ్చు. హాల్మార్క్ చేసిన వస్తువుకు నగల దుకాణదారుడి నుండి ఏహెచ్సీలు రూ.35 వసూలు చేస్తాయి. మీరు సొంతంగా కూడా ఏహెచ్సీ వద్ద ఆభరణాలను తనిఖీ చేయవచ్చు. BIS వెబ్సైట్లో ఏహెచ్సీల జాబితాను చూడవచ్చు. కొంత మొత్తం ఛార్జీలతో కస్టమర్లు తమ ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.