ఇంటిపై ఇన్వెస్ట్ చేసి, సెప్టెంబర్ 30 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి. కంపెనీలు వేతనాల్లో కోత విధించారు. దీంతో ప్రజల చేతుల్లో నగదు లేకుండా పోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇళ్లు కొనేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో ఆదాయపు పన్ను మినహాయింపు ఊరటను కల్పించింది. సెక్షన్ 54 నుండి సెక్షన్ 54జీబీ కింద ఈ పన్ను మినహాయింపును ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటి కొనుగోలుకు ఇది మంచి సమయంగా చెబుతున్నారు. ఈ పన్ను మినహాయింపు క్లెయిమ్ గడువు జూన్ చివరి నాటి వరకు ఉండగా కేంద్రం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.
పెట్టుబడిపై పన్ను మినహాయింపు క్లెయిమ్
కరోనా మహమ్మారి నేపథ్యంలో కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ఖర్చు చేసే పెట్టుబడిపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. సాధారణంగా ఈ గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. కరోనా కారణంగా గడువును పొడిగించింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54GB ప్రకారం రెసిడెన్షియల్ ప్రాపర్టీని విక్రయిస్తే క్యాపిటల్ గెయిన్స్ పైన పన్ను మినహాయింపు లభిస్తుంది.
గడువు ఇదే...
అయితే ప్రాపర్టీ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును మూడేళ్ల లోపు కొత్త ఇళ్లు నిర్మించుకోవడానికి లేదా రెండేళ్ల లోపు కొత్త ఇంటిని కొనుగోలు చేయడానికి ఉపయోగించాలి. అప్పుడే మీరు పెట్టుబడి పెట్టే నగదుపై పన్ను మినహాయింపు ఉంటుంది. 2019 కేంద్ర బడ్జెట్లో సెక్షన్ 54 కింద మూలధన లాభం పన్ను మినహాయింపును పెంచింది. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ పెట్టుబడి పెట్టే నగదు రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. పన్ను చెల్లింపుదారు ఈ అవకాశాన్ని ఒకేసారి మాత్రమే వినియోగించుకోవాలి. ఇది వరకు కొనుగోలు లేదా నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంది.
మరిన్ని ఊరటలు...
కరోనా నేపథ్యంలో కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కూడా కల్పించింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును మూడు నెలల పాటు పొడిగించింది. అదే విధంగా కరోనా కారణంగా ఏ ఉద్యోగి అయినా చనిపోతే ఆ ఉద్యోగి కుటుంబానికి యాజమాన్యం ఇచ్చే పరిహార మొత్తంపై పన్ను మినహాయింపును కల్పించింది.