అక్టోబర్ 1 నుండి కొత్త నిబంధనలు, హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం 20% వరకు భారం!
అక్టోబర్ 2020 నుండి హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో సాధారణ చికిత్సా విధానంలో మార్పులు వచ్చాయి. వైద్య విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో రూపొందించిన హెల్త్ ఇన్సురెన్స్ పాలసీ నిబంధనల్లో మార్పులు, చేర్పులు అవశ్యంగా మారాయి. పాలసీదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా, పారదర్శకత పెంచేలా IRDAI గత ఏడాది సెప్టెంబర్ నెలలో పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
మినహాయింపుల జాబితా తగ్గించడం, రోబోటిక్ సర్జరీలాంటి ఆధునిక చికిస్త పద్ధతులకు పరిహారం వర్తింపచేయడం వంటి కొత్త పాలసీలను రూపొందించాలని సూచించింది. కొత్త నిబంధనలతో కూడిన పాలసీలు వచ్చే నెల 1వ తేదీ నుండి (అక్టోబర్ 1) నుండి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో హెల్త్ ఇన్సురెన్స్ ప్రీమియం భారం కావొచ్చు.
ఏటీఎంకు వెళ్తున్నారా.. ఈరోజు నుండి మొబైల్ కచ్చితంగా వెంట తీసుకెళ్లండి!
ఎంత మేర పెరగవచ్చు
ఇన్సురెన్స్ కంపెనీలు కొత్త మార్పులు చేసేందుకు సిద్ధమయ్యాయి. IRDAI నిబంధనలకు తోడు కరోనా నేపథ్యంలో ప్రీమియాన్ని సవరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాలసీని బట్టి ప్రీమియం 5 శాతం నుండి 20 శాతం మేర పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 శాతం ప్రీమియం పెంచేందుకు IRDAI అనుమతులు అవసరం లేదు. అంతకంటే పెంచితే మాత్రం అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రీమియాన్ని నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఓసారి చెల్లించే వెసులుబాటు కూడా వచ్చింది.
అనారోగ్యాల జాబితా.. మార్గదర్శకాలు
రెగ్యులేటరీ బాడీ IRDAI వివిధ అనారోగ్యాలను పేర్కొనే మార్గదర్శకాల జాబితాను విడుదల చేసింది. ఇవి ఇప్పుడు సాధారణ ఆరోగ్య బీమా పరిధిలో ఉంటాయి. భవిష్యత్తులో ప్రమాదకర కార్యకలాపాల కారణంగా సంక్రమించిన అనారోగ్యాలను మినహాయించకుండా బీమా సంస్థలను నిరోధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మానసిక ఆరోగ్యానికి చికిత్స, వయస్సు సంబంధిత క్షీణత వంటి వివిధ వ్యాధులనుఆరోగ్య బీమా పథకం కింద పొందుపరుస్తారు. హెల్త్ ఇన్సురెన్స్ కింద బిహేవియర్ అండ్ న్యూరోడెవలప్మెంట్ డిజార్డర్స్, జన్యు సంబంధ రోగాలు వంటివి కూడా కవర్ చేయబడతాయి.
8 ఏళ్ల తర్వాత తిరస్కరించలేరు
కొత్త నిబంధనల ప్రకారం పాలసీ తీసుకునే నాటికి 48 నెల క్రితం వరకు డాక్టర్ ధృవీకరించి, చికిత్స అందించిన జబ్బులనే ముందస్తు వ్యాధులుగా గుర్తిస్తారు. వీటికి మినహాయింపు ఉంటుంది. ఎనిమిదేళ్లు వరుసగా ప్రీమియం చెల్లించి, ఆరోగ్య బీమా కొనసాగించిన వారికి, ఆ తర్వాత ఎలాంటి చికిత్సకు అయినా పరిహారం ఇవ్వాలి. శాశ్వత మినహాయింపుగా దానిని పేర్కొంటే తప్ప క్లెయిమ్ తిరస్కరించే హక్కులేదు. పాలసీ కొనుగోలుదారుకు ఇది ఉపశమనం కలిగిస్తుంది. ఇదివరకు వరుసగా 10 ఏళ్ల పాటు కొన్న తర్వాత కూడా తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి.
30 రోజుల్లో చెల్లించకుంటే..
IRDAI కొత్త నిబంధనల ప్రకారం బీమా సంస్థ పాలసీదారుకు క్లెయిమ్ చెల్లించడం లేదా తిరస్కరించడం అనేది 30 రోజుల్లో పూర్తి చేయాలి. లేదంటే అన్ని పత్రాలు అందిన తేదీ నుండి లెక్కించి, క్లెయిమ్ మొత్తానికి బ్యాంకు వడ్డీ రేటు కంటే 2 శాతం అధిక వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.
కొత్త పాలసీలు తీసుకునే వారికి అక్టోబర్ 1వ తేదీ నుండి మారిన నిబంధనలతో పాలసీలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబర్ 30 వరకు పాలసీలను తీసుకుంటే లేదా పునరుద్ధరణ చేసుకున్న వారికి ఏప్రిల్ 1, 2021 నుండి ఈ కొత్త నిబంధనలకు అమలులోకి వస్తాయి.